Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రూప్ 1 లో మరో 60 పోస్టుల పెంపు

  • గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఆదేశాల జారీ
  • కొత్తగా 60 పోస్టులు పెంచిన తెలంగాణ ప్రభుత్వం
  • 563కు చేరిన గ్రూప్ వన్ పోస్టుల సంఖ్య
Telangana Government increases Group 1 posts

తెలంగాణ ప్రభుత్వం... నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది! గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేయడంతో పాటు పోస్టులను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రూప్-1లో మరో 60 పోస్టులను పెంచుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం 503 పోస్టులకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వల్ల ఆ నోటిఫికేషన్ రద్దయింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ ప్రభుత్వం 60 పోస్టులు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో గ్రూప్-1 పోస్టుల సంఖ్య 563కి చేరాయి.

2022 ఏప్రిల్‌లో 503 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ సమయంలో 3,50,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2022 అక్టోబర్‌లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా... 2,80,000 మంది హాజరయ్యారు. ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలైనా... పేపర్ లీకేజీ కారణంగా ఆ పరీక్ష రద్దయింది. దీంతో 2023 జూన్‌లో మళ్లీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. పరీక్షల నిర్వహణలోని లోపాల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇంకోవైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కోర్టులో ఇంత వరకు వాదనలు జరగలేదు.

More Telugu News