Anand Mahindra: అదే నిజమైతే ఈ జాబితా మార్చాల్సిందే: ఆనంద్ మహీంద్రా

  • సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టు చేసిన ఆనంద్ మహీంద్రా
  • ఇటీవల 12th ఫెయిల్ సినిమా చూశానని వెల్లడి
  • భారత్ లో అత్యంత కఠినమైన ఎగ్జామ్ ఏదంటూ సర్వే
  • చాలామంది యూపీఎస్సీ అని చెప్పారన్న ఆనంద్ మహీంద్రా
Anand Mahindra quest for what is toughest exam in India ends with UPSC Exam

ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో మరోసారి తనదైన శైలిలో ఓ పోస్టు చేశారు. దేశంలో అత్యంత కఠినమైన ఎగ్జామ్ ఏది అన్నదే ఆ పోస్టులో ప్రధాన టాపిక్. 

"ఇటీవల నేను 12th ఫెయిల్ అనే సినిమా చూశాను. ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది కుర్రకారుతో మాట్లాడాను. మన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో అత్యంత కఠినమైన పరీక్ష ఏది? అని అడిగాను. నేను మాట్లాడిన వారిలో ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్ కూడా ఉన్నాడు. అతడు ఓ బిజినెస్ స్టార్టప్ ఏర్పాటులో పాలుపంచుకున్న వ్యక్తి. అతడు కూడా అత్యంత కఠినమైన పరీక్షగా యూపీఎస్సీ పరీక్షను పేర్కొన్నాడు. ఐఐటీ జేఈఈ కంటే యూపీఎస్సీ ఎగ్జామ్ చాలా కష్టమైనదని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ అందరి అభిప్రాయం ఇదే అయితే... ఈ కింది జాబితాను వెంటనే మార్చాల్సిందే" అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. 

అంతేకాదు, ప్రపంచంలోని అత్యంత కఠినమైన పరీక్షల వరల్డ్ ర్యాంకింగ్ జాబితాను కూడా రీట్వీట్ చేశారు. ఆ జాబితాలో చైనాకు చెందిన గావో కావో పరీక్ష అత్యంత కఠినమైన పరీక్షగా నెం.1 స్థానంలో  ఉంది. రెండో స్థానంలో ఐఐటీ జేఈఈ, మూడో స్థానంలో యూపీఎస్సీ ఉంది. 

ఆనంద్ మహీంద్రా సర్వే ప్రకారం ఈ జాబితాలో యూపీఎస్సీ ఎగ్జామ్ రెండో స్థానానికి, ఐఐటీ జేఈఈ పరీక్ష మూడో స్థానానికి మార్చాల్సి ఉంటుంది.

More Telugu News