Shubman Gill: విశాఖ టెస్టులో గిల్ సెంచరీ

  • మళ్లీ ఫామ్ లోకి వచ్చిన యువ బ్యాట్స్ మన్
  • టెస్టుల్లో గిల్ కు ఇది మూడో సెంచరీ
  • రెండో టెస్టు మ్యాచ్ పై పట్టు బిగించిన భారత్
Shubman Gill Century In Vishaka Test Match

విశాఖపట్నంలో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో భారత్ పట్టుబిగిస్తోంది. యువ బ్యాట్స్ మన్ శుభ్ మన్ గిల్ సెంచరీ బాదడంతో జట్టు స్కోరు దూసుకుపోతోంది. ఇంగ్లాండ్ పై భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. గత కొంతకాలంగా విఫలమవుతున్న శుభమన్ గిల్.. విశాఖ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. 131 బంతులను ఎదుర్కొని టెస్టుల్లో మూడో సెంచరీ సాధించాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 202-4. ఆధిక్యం 345 పరుగులు.

ఓవర్నైట్ స్కోర్ 28-0తో శనివారం ఆట ప్రారంభించిన భారత జట్టు... వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులు జోడించి ఔటయ్యాడు. ఆ వెంటనే యశస్వి జైశ్వాల్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, రజత్ పటీదార్ కూడా విఫలమయ్యారు. దీంతో 122 పరుగులకే భారత జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో శుభ్ మన్ గిల్, అక్షర్ పటేల్ తో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. 

కాగా, ఇటీవలి కాలంలో జరిగిన టెస్టు మ్యాచులలో గిల్ ప్రదర్శన బాగాలేదు. తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్నాడు. తాజా మ్యాచ్ లో మళ్లీ ఫామ్ లోకి వచ్చి సెంచరీ బాదడంతో గిల్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News