Bandla Ganesh: ముందు లిక్కర్ కేసు నుంచి బయటపడు... ఈ కేసు వల్ల నీ తల్లి ఎంత బాధపడ్డారో!: కవితపై బండ్ల గణేశ్ ఆగ్రహం

  • రేవంత్ రెడ్డిపై విమర్శలు తర్వాత కానీ, ముందు లిక్కర్ కేసు నుంచి బయటపడాలని కవితకు సూచన
  • ఇన్నాళ్లు గుర్తుకు రాని పూలే ఈ రోజు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్య
  • కాంగ్రెస్ పాలనను అందరూ మెచ్చుకుంటోంటే మీకు నచ్చడం లేదని ఆగ్రహం
  • ఆడబిడ్డవి... నీపై లిక్కర్ కేసు వస్తే నీ తల్లిదండ్రులకు అవమానం కాదా? అని వ్యాఖ్య
Bandla Ganesh lashes out at Kavitha

'ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు తర్వాత కానీ ముందు మీరు లిక్కర్ కేసు నుంచి బయటపడండి... రెస్ట్ తీసుకోండి... ఏం తప్పు చేశారో తెలుసుకోండి... ప్రెస్ మీట్లు బంద్ చేయండి... అసహ్యించుకుంటున్నారు' అంటూ సినీ నిర్మాత బండ్ల గణేశ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. కవితను నేను ఓ ప్రశ్న అడుగుతానని... తప్పుగా అనుకోవద్దన్నారు. ఇన్నాళ్లుగా గుర్తుకు రాని పూలే ఈ రోజు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. గత పదేళ్లు బీసీల గురించి మాట్లాడని మీరు ఈ రోజు మాట్లాడటం ఆనందంగా ఉందని ఎద్దేవా చేశారు.

కానీ రేవంత్ రెడ్డి పరిపాలనను... కాంగ్రెస్ పరిపాలనను తెలంగాణ ప్రజలంతా మెచ్చుకుంటుంటే మీకు నచ్చడం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ అని... ఆ పార్టీని విమర్శించవద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ప్రజల్లోకి వెళితే మీకు ఇష్టం ఉండదని... గేటు బయటే ఆపేసి బతికున్న గద్దర్‌ను చంపేశారని ఆరోపించారు. ఆయన పేరుపై కాంగ్రెస్ పార్టీ అవార్డులు తెస్తోందన్నారు. జానారెడ్డి తను తప్పుకున్న తర్వాతే కొడుకుకి అవకాశమిచ్చారని గుర్తు చేశారు. మంత్రులను డమ్మీ చేసింది మీరు కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

లిక్కర్ కేసులో అక్రమ సంపాదనకు పాల్పడలేదా? అని నిలదీశారు. లిక్కర్ కేసుతో రాష్ట్రాన్ని అపఖ్యాతిపాలు చేసింది మీరు కాదా? అని విమర్శించారు. ఎంపీగా ఓడిపోతే మీరు ఏడ్చి... ఎమ్మెల్సీ తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ ఆఫీస్ కోసం స్థలం ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీని కూడా మీరు పట్టించుకోలేదని ఆరోపించారు. మీరు... కేటీఆర్ సీఎం కావాలని ఆశపడ్డారు... అది నెరవేరకపోవడంతో రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు కవిత లిక్కర్ కేసు నుంచి బయటపడాలన్నారు. ఆడబిడ్డవి... నీపై లిక్కర్ స్కాం కేసు రావడం నీ తల్లిదండ్రులకి అవమానమని వ్యాఖ్యానించారు. దీని వల్ల నీ తల్లి ఎంత క్షోభపడి ఉంటుందో ఆలోచించాలన్నారు. ఇలాంటి బిడ్డను ఎందుకు కన్నానని ఆ మహాతల్లి ఎంత బాధపడిందో అన్నారు.

కాంగ్రెస్ పార్టీని కుటుంబ పార్టీ అనడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ 'రావు'ల పార్టీగా ఉండటంలో తప్పులేదా? అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని దోచుకున్నారని... రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. తెలంగాణపై 7 లక్షల కోట్ల రూపాయల అప్పు పెట్టారని మండిపడ్డారు. అన్ని శాఖలను అప్పుల్లో ముంచారన్నారు.

More Telugu News