Revanth Reddy: రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అయినా బుద్ధి చెప్పాలి: హరీశ్ రావు

Harish Rao suggestion to Rahul Gandhi over Revanth Reddy
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అయినా బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సూచించారు. ఉదయం ఆయన భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామివారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత భద్రాచలంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశంలోనే రేవంత్ రెడ్డి అంత సంస్కారహీనుడైన సీఎం లేరని విమర్శించారు. ఆయనకు కాంగ్రెస్ పెద్దలు బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్ వెనకడుగు వేస్తే తెలంగాణ వచ్చేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడా? అని ప్రశ్నించారు.

తెలంగాణ కాంగ్రెస్ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీలోనూ అబద్ధాలే.. ఆదిలాబాద్‌లోనూ అబద్ధాలే అని ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లాకు నాలుగు మెడికల్ కాలేజీలు ఇచ్చింది బీఆర్ఎస్ అని గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ తెచ్చిన మార్పు సున్నా ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ నేతలకు తిట్ల పురాణం తప్ప చేసిందేమీ లేదని... వారు చెప్పిన మార్పు ఇదేనా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో తిరోగమనం మొదలైందన్నారు. కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు.

అదానీతో ఒప్పందాలు చేసుకున్నారని విమర్శ

ఓ వైపు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు అదానీపై విమర్శలు గుప్పిస్తారని... మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు వారితో అంటకాగుతారని చురక అంటించారు. కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ అయ్యాయని ఆరోపించారు. అదానీతో కాంగ్రెస్ ఒప్పందాలు చేసుకుందన్నారు. దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా గతంలో తమ ప్రభుత్వం నామినేట్ చేస్తే గవర్నర్ తిరస్కరించారని... కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించగానే ఆమోదించారని విమర్శించారు. దీనిని బట్టే ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో ఇట్టే అర్థమవుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్‌లను ఓడించింది బీఆర్ఎస్ అని గుర్తుంచుకోవాలన్నారు.

సీనియర్ సిటిజన్లకు ప్రకటించిన రూ.4వేల పెన్షన్ ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. కనీసం ఇప్పటి వరకు తాము ఇచ్చిన రూ.2వేలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 24 గంటల విద్యుత్ ఇచ్చామని... ఇప్పుడు రోజుకు పలుమార్లు పోతోందన్నారు. ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్డుకీడ్చారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అదిలాబాద్‌లో అన్నీ అబద్ధాలే చెప్పారన్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
Telangana
Harish Rao

More Telugu News