V Hanumantha Rao: షర్మిలపై దారుణమైన పోస్టర్లు వేస్తున్నా జగన్ పట్టించుకోవడం లేదు: వి.హనుమంతరావు

  • జగన్ కోసం షర్మిల ఎంతో కష్టపడిందన్న వీహెచ్
  • వైఎస్ కూతురు కాదని ప్రచారం చేస్తున్నా జగన్ స్పందించడం లేదని మండిపాటు
  • రాజకీయాల కోసం జగన్ ఇంతకు దిగజారుతారా? అని ఆగ్రహం
V Hanumantha Rao fires on Jagan

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత చెల్లెళ్లపై కూడా ప్రేమ లేని జగన్ మహిళా సాధికారతపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన కోసం, వైసీపీ కోసం షర్మిల ఎంతో కష్టపడిందని అన్నారు. అలాంటి షర్మిలపై జగన్ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సొంత పార్టీ శ్రేణుల నుంచే షర్మిలకు అవమానం జరుగుతున్నా జగన్ పట్టించుకోవడం లేదని అన్నారు. 

షర్మిల రాజశేఖరరెడ్డి కూతురు కాదని తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టర్లు వేస్తున్నా జగన్ స్పందించడం లేదని వీహెచ్ దుయ్యబట్టారు. ఈ పోస్టర్స్ చూస్తుంటే తనకు ఎంతో ఆవేదన కలుగుతోందని చెప్పారు. రాజకీయాల కోసం జగన్ ఇంతకు దిగజారుతాడా? అని ప్రశ్నించారు. షర్మిల, సునీతలపై జగన్ కు గౌరవం లేదని విమర్శించారు. చెడు సంప్రదాయాలను పక్కన పెట్టాలని సూచించారు. అధికారం ఉందని ఎగిరెగిరి పడితే ప్రజలు బుద్ధి చెపుతారని హెచ్చరించారు.

More Telugu News