KTR: రేవంత్ రెడ్డి ప్రకటనపై 'క్రెడిట్ చోరీ' అంటూ కేటీఆర్ ట్వీట్

  • 15 రోజుల్లో 15వేల మంది కానిస్టేబుళ్లను నియమించుకుంటామన్న రేవంత్ రెడ్డి
  • కాంగ్రెస్‌కు క్రెడిట్ చోరీ ఇదే మొదటిది కాదు... ఇదే చివరిది కాదని కేటీఆర్ విమర్శ
  • 15వేల కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ తమ హయాంలో జరిగిందని వెల్లడి
Not the first time will not be the last time either for Credit Chor Congress party

క్రెడిట్ చోరీ కాంగ్రెస్ పార్టీకి ఇదే మొదటిసారి కాదు... ఇదే చివరిసారి కూడా కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం విమర్శలు గుప్పించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తాము 7వేల మంది స్టాఫ్ నర్సులకు ఉద్యోగాలు ఇచ్చామని, మరో 15 రోజుల్లో 15వేల మంది కానిస్టేబుళ్లను నియమించుకుంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. ఈ రెండు అంశాలపై కాంగ్రెస్ క్రెడిట్ కొట్టేయాలని చూస్తోందని ఆరోపించారు. స్టాఫ్ నర్స్, 15వేలకు పైగా కానిస్టేబుల్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

క్రెడిట్ చోరీ కాంగ్రెస్ పార్టీకి ఇది మొదటిసారి కాదు, చివరిసారి కూడా కాదు... 6,956 స్టాఫ్ నర్సులు, 15,750 పోలీస్ కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్‌ను కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసిందని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఎన్నికల కోడ్ కారణంగా ఫలితాలను విడుదల చేయలేకపోయామని తెలిపారు. ఇప్పుడు రిక్రూట్‌మెంట్‌తో సంబంధం లేని కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తామే చేశామని ప్రజలను మోసం చేయాలనుకుంటోందని విమర్శించారు. నూతన ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటు అన్నారు.

15,750 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి కేసీఆర్ హయాంలోనే రిక్రూట్మెంట్ జరిగిందని చెబుతూ టైమ్స్ ఆఫ్ ఇండియా 5 అక్టోబర్ 2023 రోజున ఇచ్చిన వార్తను ట్వీట్‌కు జతపరిచారు. అంతేకాదు, 7 అగస్ట్ 2023 రోజున నర్సుల రిక్రూట్మెంట్‌కు సంబంధించిన జీవోను కూడా జత చేశారు.

More Telugu News