Nara Lokesh: ఇది జగన్ మోసం... నిరుద్యోగులకు నారా లోకేశ్ బహిరంగ లేఖ

  • జగన్ మోసంపై నిరుద్యోగులు ఆందోళన చెందవద్దని పిలుపు
  • తాము అధికారంలోకి రాగానే టీచర్ పోస్టుల భర్తీ చేపడతామని స్పష్టీకరణ 
  • అప్రెంటిస్ విధానం రద్దు చేస్తామని హామీ 
Lokesh wrote open letter to unemployed youth

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ నిరుద్యోగులకు బహిరంగ లేఖ రాశారు. జగన్ మోసంపై నిరుద్యోగులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం రాగానే టీచర్ పోస్టుల భర్తీ చేపడతామని తెలిపారు. ఉన్న పోస్టులు ఎత్తివేసేందుకే ప్రభుత్వం జీవో తెచ్చిందని ఆరోపించారు. జీవో నెం.117 వల్ల 65 వేల పోస్టులు రద్దయ్యాయని వివరించారు. ఉపాధ్యాయులకు అప్రెంటిస్ షిప్ విధానం రద్దు చేసి పూర్తి పేస్కేల్ అమలు చేస్తామని లోకేశ్ తన లేఖలో హామీ ఇచ్చారు.

"2019 ఎన్నిక‌ల‌కి ముందు అధికారంలోకి రాగానే 23 వేల ఖాళీ టీచ‌ర్ పోస్టుల భ‌ర్తీకి మెగా డీఎస్సీ తీస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చాడు. న‌మ్మి ఓట్లేసి గెలిపించిన నిరుద్యోగుల‌కు ఇచ్చిన హామీని జగన్ ఐదేళ్లపాటు మ‌రిచిపోయాడు. దిగిపోయే ముందు 6 వేల పోస్టుల భర్తీకి డిఎస్సీ వేస్తున్నామంటూ జ‌గ‌న్ మ‌రోసారి చేస్తున్న మోసాన్ని గుర్తించండి. 

2013లో ర‌ద్ద‌యిన అప్రెంటిషిప్ విధానాన్ని మ‌ళ్లీ తేవ‌డం జ‌గ‌న్ నాట‌కంలో భాగ‌మే. 2019 ఎన్నిక‌ల ముందు డిఎస్సీ హామీ ఇచ్చాడు, 2024 ఎన్నిక‌లొస్తున్న‌ప్పుడు ఆ హామీని అమ‌లు చేస్తానంటున్న జ‌గ‌న్ మాయ‌మాట‌లు న‌మ్మొద్దు నిరుద్యోగులారా! ఎన్నికల ముందు 23 వేల ఖాళీలు ఉన్నాయ‌న్న జ‌గ‌న్‌, ఎన్నికల తరువాత 18 వేల ఖాళీలే అని మాట మార్చాడు. 

మంత్రి బొత్స ఖాళీగా ఉన్న 8,366 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. చివ‌రికి 6 వేల పోస్టులకు డిఎస్సీ నోటిఫికేష‌న్ ఇస్తామ‌ని ఎల‌క్ష‌న్ డ్రామా మొద‌లుపెట్టారు. ఏపీలో 50 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్ల‌మెంటులో కేంద్రం వెల్ల‌డించింది. 

ఐదేళ్ల‌కి ముందు 23 వేలు పోస్టులుంటే, జగన్ పాలనలో ఒక్క పోస్టూ భర్తీ చేయలేదు, ఈ కాలంలో రిటైరయిన పోస్టులు కలిపితే రెండింతలు కావాలి. అయితే జగన్ మాయతో  వేల టీచ‌ర్ పోస్టులు గల్లంతయ్యాయి. దీనిపై నిరుద్యోగ యువ‌త‌కు జగన్ సర్కారు స‌మాధానం చెప్పాలి. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్నప్పుడు డిఎస్పీ నోటిఫికేషన్ ఇస్తే, ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే కనీసం పరీక్ష నిర్వహణ కూడా సాధ్యం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ అంటే మ‌రోసారి నిరుద్యోగుల్ని వంచించే కుట్రే. 

ఎన్టీఆర్, చంద్ర‌బాబు నేతృత్వంలోని ప్ర‌భుత్వాలు ఇప్ప‌టివ‌ర‌కూ 1,70,000 టీచ‌ర్ పోస్టులు పార‌ద‌ర్శ‌కంగా భ‌ర్తీ చేసిన ఘ‌న‌త దక్కించుకున్నాయి. ఇదే అనుభవంతో టీడీపీ-జ‌న‌సేన ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఖాళీగా ఉన్న టీచ‌ర్ పోస్టులు భ‌ర్తీ చేస్తాం. కొత్త పోస్టులు భర్తీ చేయకపోగా, ఉన్న పోస్టులు ఎత్తేసేందుకు జగన్ ప్రభుత్వం తెచ్చిన 117 జీవో వల్ల 65 వేల పోస్టులు ర‌ద్ద‌యిపోయాయి. 

వేల టీచరు పోస్టుల్ని మాయం చేసిన జగన్ నాటకం జీవో 117 ఎత్తేస్తాం. 2013లో రద్దయిన అప్రెంటిషిప్ విధానాన్ని అమలు చేస్తూ జగన్ చేస్తోన్న అన్యాయాన్ని సరిదిద్దుతాం. అప్రెంటిషిప్ విధానం రద్దు చేసి పూర్తిస్థాయి పేస్కేల్ అమలు చేస్తాం. 2014,  2019లో రెండు మెగా డీఎస్సీల ద్వారా 16,790 నిరుద్యోగులకు టీచర్ ఉద్యోగాలు కల్పించిన చంద్రబాబు మళ్లీ వస్తున్నారు. జగన్ మోసంతో నిరాశ చెందకుండా డీస్సీకి ఇప్పటి నుంచే సిద్ధం అవ్వండి" అంటూ పిలుపునిచ్చారు.

More Telugu News