KTR: సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేశారు: కేటీఆర్

  • తెలంగాణ హక్కులు సాధించాలంటే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలవాలన్న కేటీఆర్
  • కేంద్రంలో అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ చెబుతోందని ఆగ్రహం
  • బీజేపీని అడ్డుకోవడం ప్రాంతీయ పార్టీల వల్లే సాధ్యమన్న కేటీఆర్
KTR comments on CM Revanth Reddy over promises

ఆరు గ్యారెంటీల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఘట్‌కేసర్‌లో నిర్వహించిన మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ హక్కులు సాధించాలంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలిచి తీరాలన్నారు. కాంగ్రెస్ పార్టీ 420 అబద్ధపు హామీలు ఇచ్చి గెలిచిందని ఆరోపించారు. డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారని... కానీ ఇప్పటి వరకు ఆ ఊసే లేదన్నారు.

100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్... ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వస్తే వాటిని అమలు చేస్తామని చెబుతున్నారని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు... గ్యారెంటీలు అమలు చేసేది లేదని ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీకి గతంలో వచ్చిన సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. I.N.D.I.A. కూటమిలో ముఖ్యమైన పార్టీలు వెళ్లిపోయాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చెక్ పెట్టాలని... కేంద్రంలో బీజేపీని అడ్డుకోగలిగేది ప్రాంతీయ పార్టీలేనని వ్యాఖ్యానించారు.

కృష్ణా జలాల్లో వాటాను తేల్చాలని డిమాండ్

కృష్ణా జలాల్లో కేంద్రం తెలంగాణ వాటాను తేల్చాలని డిమాండ్ చేశారు. మన వాటాను తేల్చకుండానే కేఆర్ఎంబీకి మన కృష్ణా జలాలను రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టారని ఆరోపించారు. అందుకే తెలంగాణకు న్యాయం జరగాలంటే బీఆర్‌ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఉండాలన్నారు. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేది బీఆర్‌ఎస్ ఎంపీలేనని వ్యాఖ్యానించారు. మాయమాటలు చెప్పి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని... 420 హామీలు ఇచ్చిన రేవంత్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 

రేవంత్ వంటి బుడ్డర్ ఖాన్‌లను కేసీఆర్ ఎంతోమందిని చూశారు

రుణమాఫీ అమలు కాలేదు... ఆడబిడ్డలకు రూ.2500 ఇవ్వలేదు... రూ.500కే గ్యాస్ సిలిండర్ అమలు చేయడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలు జుట్లు పట్టుకుంటున్నారన్నారు. ఆరున్నర లక్షలమంది ఆటో డ్రైవర్లు రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కడుపు కాలిన ఓ ఆటోడ్రైవర్‌ ప్రజాభవన్‌ ముందు ఆటో కాలబెట్టాడన్నారు. బీఆర్‌ఎస్‌ను పాతిపెడతానని రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ లాంటి బుడ్డర్ ఖాన్‌లను కేసీఆర్‌ ఎంతోమందిని చూశారన్నారు. ఎంతో మంది తీస్మార్ ఖాన్‎లను మాయం చేసి తెలంగాణ తెచ్చారన్నారు. ఒక్క కార్యకర్తకు అన్యాయం జరిగినా అందరం వస్తామని ధైర్యం చెప్పారు. మనకు బాస్‌లు ఢిల్లీలోనో... గుజరాత్‌లో లేరని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ లంకెబిందెల కోసం అధికారంలోకి వచ్చిందని... కానీ సచివాలయంలో కంప్యూటర్లు, జీవోలు ఉంటాయని వారు తెలుసుకోవాలని చురక అంటించారు. లంకెబిందెల కోసం వెతికేది ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. ప్రతి హామీని నెరవేర్చే వరకు ప్రజల తరపున పోరాడుతామని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కాలేదని ప్రజలు బాధపడుతున్నారన్నారు.

More Telugu News