Roja: షర్మిల చెప్పేవన్నీ అబద్ధాలే.. కుటుంబాలను చీల్చడం చంద్రబాబుకు అలవాటు: రోజా

  • షర్మిల చంద్రబాబు స్క్రిప్ట్ చదువుతున్నారన్న రోజా
  • టీడీపీ, జనసేన కోసం షర్మిల చేస్తున్నది ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య
  • చంద్రబాబుకు అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా
Roja comments on Chandrababu and YS Sharmila

టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఏపీ మంత్రి రోజా మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. షర్మిల కప్పుకున్నది కాంగ్రెస్ కండువా అని... కానీ ఆమె చదివే స్క్రిప్ట్ మాత్రం చంద్రబాబుదని ఎద్దేవా చేశారు. కుటుంబాలను చీల్చడం చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. చంద్రబాబు మూడు సార్లు సీఎంగా చేశారని... అయినప్పటికీ, మేనిఫెస్టోలో పెట్టిన వాటిని అమలు చేశామని చెప్పే ధైర్యం ఆయనకు లేదని విమర్శించారు. 

నాడు ఎన్టీఆర్ కుటుంబాన్ని చీల్చిన చంద్రబాబు... ఈరోజు సీఎం జగన్ కుటుంబం వరకు వచ్చారని రోజా దుయ్యబట్టారు. ఎన్నికల్లో పోటీ చేయించేందుకు చంద్రబాబుకు అభ్యర్థులు దొరకడం లేదని... అందుకే వైసీపీ నుంచి తరిమేసిన నేతలను టీడీపీలోకి తీసుకుంటున్నారని చెప్పారు. 

తెలంగాణలో పార్టీ పెట్టుకున్న షర్మిల... ఇప్పుడు ఏపీలో టీడీపీ, జనసేనల కోసం ఏం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని రోజా అన్నారు. ఏపీకి వచ్చిన షర్మిల అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని విమర్శించారు. తన నగరి నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదంటున్న విపక్ష నేతలు... నగరికి వచ్చి చూస్తే తాము చేసిన అభివృద్ధి ఏమిటో తెలుస్తుందని అన్నారు.

More Telugu News