Budget: కేంద్ర బడ్జెట్ ను స్వాగతిస్తున్నాం... విజన్-2047ను ప్రతిబింబించేలా ఉంది: అచ్చెన్నాయుడు

  • నేడు కేంద్ర బడ్జెట్ ను ప్రకటించిన ఎన్డీయే సర్కారు
  • బడ్జెట్ పై అచ్చెన్నాయుడు ప్రశంసలు
  • ఉపాధి, ఉద్యోగ కల్పనకు పెద్దపీట వేయడం శుభపరిణామం అని వెల్లడి
  • జగన్ రెడ్డి చేసింది శూన్యం అంటూ విమర్శలు
TDP AP Chief Atchannaidu welcomes union budget

స్వాతంత్ర్యం సాధించి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకునే సమయానికి భారత్ ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దేలా కేంద్ర బడ్జెట్ ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను స్వాగతిస్తున్నామని తెలిపారు. 

బడ్జెట్‌ నిర్ణయాలు విజన్-2047 లక్ష్యసాధన దిశగా ఉన్నాయని కొనియాడారు. మౌలిక సదుపాయాల రంగానికి, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వడం శుభ పరిణామం అని అచ్చెన్న పేర్కొన్నారు. దేశ గతిని మార్చే మౌలిక వసతుల రంగానికి రూ.11 లక్షల కోట్లు కేటాయించడంతో పాటు 1.40 కోట్ల మంది యువతకు స్కిల్ ఇండియా మిషన్ కార్యక్రమాన్ని అమలు చేయాలనుకోవడం హర్షణీయం అని అన్నారు. 

2014 - 2019 మధ్య కాలంలో నైపుణ్య శిక్షణ ద్వారా ఉద్యోగాల కల్పనలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న విషయాన్ని అచ్చెన్నాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

"2024తో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి 10 ఏళ్ల కాలపరిమితి ముగుస్తున్నా రాష్ట్రానికి నిధుల సాధనలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గత 5 ఏళ్లలో వైసీపీ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రం అన్ని రంగాల్లో తీవ్రంగా నష్టపోయింది. 

25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన జగన్ రెడ్డి 31 మంది ఎంపీలను పెట్టుకుని రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పాలి. విభజన చట్టంలో కేటాయించిన 11 జాతీయ విద్యా సంస్థలను తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొస్తే వాటికి నిధులు కూడా తేలేకపోవడం జగన్ రెడ్డి వైఫల్యం కాదా? 

కేంద్ర ప్రాయోజిక పథకాలకు రాష్ట్ర వాటా నిధులు కూడా ఇవ్వలేక వేల కోట్ల కేంద్ర నిధులను నిరుపయోగం చేయడం తప్ప జగన్ రెడ్డి చేసింది శూన్యం" అని అచ్చెన్నాయుడు విమర్శనాస్త్రాలు సంధించారు.

More Telugu News