Puri Jagannadh: మా అబ్బాయి కష్టాలు చూసి ఏడ్చేశాను: దర్శకుడు పూరి జగన్నాథ్ తల్లి అమ్మాజీ

  • అతనికి చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టమన్న అమ్మాజీ  
  • 12 ఏళ్లపాటు కష్టాలు పడ్డాడంటూ ఆవేదన 
  • అవకాశాల కోసం కాళ్లు వాచిపోయేలా తిరిగేవాడని వివరణ

Ammaji Interview

 దర్శకుడు పూరి జగన్నాథ్ భార్యాపిల్లలు తప్ప, ఆయన తల్లి అమ్మాజీ ఎప్పుడూ కెమెరాల ముందుకు రాలేదు. అలాంటి ఆమె తాజాగా 'తెలుగు వన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అనేక విషయాలను పంచుకున్నారు. " ఏడవ తరగతి నుంచి పూరి జగన్నాథ్ కి సినిమాలపై ఇష్టం పెరుగుతూ వచ్చింది. కాలేజ్ లో చదువుతున్నప్పుడు కూడా ధ్యాస అంతా సినిమాలపైనే ఉండేది. 'సినిమాల్లోకి వెళతా .. డైరెక్టర్ ను అవుతా' అని నాతో అంటూ ఉండేవాడు" అని చెప్పారు.  

" పూరి ఇష్టం గురించి తెలుసుకున్న తరువాత వాళ్ల నాన్నగారు కూడా  'సరే' అన్నారు. అలా వెళ్లిన పూరి 12 ఏళ్లపాటు కష్టపడ్డాడు. మేము డబ్బులు పంపించినా అవి చాలక, తనకి తెలిసిన పనులు చేస్తూ రోజులు గడుపుతూ వచ్చాడు. కథలు పట్టుకుని అలా తిరుగుతూ ఉండేవాడు. ఎంత దూరమైనా నడిచే వెళ్లేవాడు. ఒకసారి అలా తిరిగొచ్చినప్పుడు నేను అక్కడే ఉన్నాను. పాదాలు వాచిపోయి సాక్సులు రాలేదు' అని చెబుతూ ఉద్వేగానికి లోనయ్యారు. 

" మా అబ్బాయి కష్టాలు చూడలేక మన ఊరు వెళ్లిపోదాం ... వ్యవసాయం చేసుకుందువుగాని అని నేను అంటే .. బాధపడొద్దు ... దేవుడు ఉన్నాడులే అన్నాడు. ఆ తరువాత పవన్ కల్యాణ్ గారు అవకాశం ఇచ్చారు. ఆయన కథ మార్చమంటే పూరి మార్చనని చెప్పాడట. 'నీలో ఆ నిజాయతీ నచ్చింది' అని చెప్పి అవకాశం ఇచ్చారట. ఆ సంగతి నాకు చెప్పినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది" అంటూ చెప్పుకొచ్చారు. 

More Telugu News