ఆంబోతు రాంబాబూ... నీకు కళ్లెం వేస్తా: చంద్రబాబు

Chandranbabu warns Rambabu
రాజమండ్రిలో నిర్వహించిన రా... కదలి రా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగే ప్రసంగం చేశారు. రాష్ట్రాన్ని ఒక మానసిక రోగి పాలిస్తున్నాడని విమర్శించారు. జగన్ పాలనలో అందరం బాధితులమేనని అన్నారు. వైసీపీ నేతలు అనే మాటలను ప్రజల కోసం భరిస్తున్నానని పేర్కొన్నారు. సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తుంటే దాడి చేశారని చంద్రబాబు మండిపడ్డారు. 

"అక్కడొక సైకో ఉన్నాడు... ఆంబోతు రాంబాబు! ఆంబోతు ఇదే చెబుతున్నా... నీకు కళ్లెం వేస్తా... వదిలిపెట్టం... వడ్డీ సహా చెల్లిస్తాం... ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా" అంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

వైసీపీలో తిరుగుబాటు మొదలైందని అన్నారు. ఇప్పుడు వైసీపీ తరఫు నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. విడదల రజని, ఆదిమూలం సురేశ్, మేరుగ నాగార్జున, గుమ్మనూరు జయరాం, ఉషశ్రీ చరణ్, నారాయణస్వామి, గుడివాడ అమర్నాథ్ సహా 10 మంది మంత్రులు ఎన్నికలు రాకముందే అవుటైపోయారు... గేమ్ ఈజ్ ఓవర్ అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

ఎప్పుడైతే టీడీపీ-జనసేన పొత్తు ప్రకటించామో వాళ్లకు ప్యాంట్లు తడిచిపోయాయని, డైపర్లు వేసుకుని తిరుగుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తనకు అన్యాయం జరిగిందని గళం విప్పాడని వెల్లడించారు. ఆదిమూలంను ఈ ఎన్నికల్లో ఎంపీగా పంపిస్తున్నారని, తాను ఎంపీగా వెళ్లనని, పార్టీకి రాజీనామా చేసేందుకు ఆదిమూలం సిద్ధమయ్యాడని వివరించారు. 

ఎమ్మెల్యేగా మళ్లీ అవకాశం ఎందుకివ్వరని ఆదిమూలం వైసీపీ హైకమాండ్ ను అడిగాడని, అందుకు వాళ్లు నియోజకవర్గంలో మీకు ప్రతికూలత ఉందని చెప్పారని వెల్లడించారు. తన నియోజకవర్గం నుంచి మట్టిని టిప్పర్ల ద్వారా భారీగా తరలించి ఆ నెపం తనపై వేశారని ఆదిమూలం వాపోయాడని చంద్రబాబు తెలిపారు. ఆదిమూలంకు ఓ న్యాయం... పెద్దిరెడ్డికి ఓ న్యాయమా? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు.
Go Back to Shorts
Chandrababu
Raa Kadali Raa
Rajahmundry
TDP
Andhra Pradesh

More Telugu News