Gudur MLA Varaprasad Rao: ప్రతిపక్ష నేతను బూతులు తిట్టకపోవడం వల్లే నాకు టికెట్ రాలేదు.. గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు

  • ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో వరప్రసాద్‌రావు వ్యాఖ్యలు
  • సర్వేల పేరుతో తమాషా చేస్తున్నారని మండిపాటు
  • వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని స్పష్టీకరణ
  • జగన్‌ను బాబూ అని పిలవడం కూడా టికెట్ రాకపోవడానికి మరో కారణమన్న ఎమ్మెల్యే
Gudur MLA Varaprasad Rao Asserts That He Will Contest In Elections

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చి వైరల్ అయ్యాయి. అందులో ఆయన మాట్లాడుతూ.. నియంతృత్వ పోకడలున్న వ్యక్తులు ప్రజలకు తనను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సర్వేల పేరుతో తమషా చేస్తూ రెండుసార్లు తనను పక్కన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీచేసి తీరుతానని తేల్చి చెప్పారు. 

సొంతఖర్చుతో రాజకీయాల్లో నెగ్గిన తాను లెక్కలేనన్ని అవమానాలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ఎంపీ నుంచి గూడురు ఎమ్మెల్యేగా మార్చి తనను వేధించారని పేర్కొన్నారు. సర్వేలో తన పరిస్థితి బాగాలేదని తేలిందని, అయినా మీరు నా గుండెల్లో ఉంటారని సీఎం చెప్పారని, తాను ఎవరి గుండెల్లోనో ఉండడానికి రాలేదని, ప్రజల గుండెల్లో ఉండేందుకే వచ్చానని తెలిపారు. ప్రతిపక్ష నేతను బూతులు తిట్టాలని చెబుతుంటారని, తాను ఆ పని చేయకపోవడం వల్లే తనకు టికెట్ రాలేదేమోనని సందేహం వ్యక్తం చేశారు. 

పార్టీ ఆవిర్భావం నుంచీ జగన్‌ను తాను బాబు అని పిలిచేవాడినని, సీఎం అయ్యాక కూడా అలాగే పిలవడం కూడా తనను దూరం పెట్టడానికి మరో కారణంగా కనిపిస్తోందని చెప్పారు. సర్వేలో తన పరిస్థితి బాగోలేదని చెప్పారని, కానీ ఆరు నెలల క్రితం ఇప్పుడు సర్వే చేసిన అధికారే 57 మార్కులు ఇచ్చారని గుర్తు చేశారు.

More Telugu News