Infosys Narayana Murthy: ప్రజాసేవకు రాజకీయాలే పరమార్థం కాదు: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి

  • తన వయసు 78 సంవత్సరాలన్న నారాయణమూర్తి
  • రాజకీయాల్లోకి వచ్చే ప్రణాళిక ఏమీ లేదని స్పష్టీకరణ
  • పిల్లలు, మనవళ్లతో గడపడానికే మిగతా జీవితాన్ని వెచ్చిస్తానన్న మూర్తి
No Plans to come into the politics says Infosys Narayana Murthy

ప్రజాసేవకు రాజకీయాలు ఒక్కటే మార్గం కాదని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి స్పష్టం చేశారు. ఆయన అర్ధాంగి సుధామూర్తి కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరు మాట్లాడుతూ.. తమ భవిష్యత్  ప్రణాళికలు వెల్లడించారు. పిల్లలు, మనవళ్లతో గడపడం, సంగీతం వినడం, పుస్తకాలు చదివేందుకు మిగతా జీవితాన్ని వెచ్చిస్తానని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా? అన్న ప్రశ్నకు నారాయణమూర్తి స్పందిస్తూ.. తనకు ఇప్పుడు 78 సంవత్సరాలని, అలాంటి ప్రణాళిక ఏదీ లేదని స్పష్టం చేశారు. అయినా, ప్రజాసేవకు రాజకీయాలు మాత్రమే పరమావధి కాదని తేల్చి చెప్పారు.  

ఇతరులతో గౌరవంగా ఎలా మెలగాలో తన పిల్లలకు చెబుతూ ఉంటానని నారాయణమూర్తి చెప్పుకొచ్చారు. సంపన్నకుటుంబాల్లో బాత్రూములు శుభ్రం చేసుకోవడం ఇప్పటికీ నిషిద్ధమేనని, కానీ తాను మాత్రం తన పిల్లలకు మరుగుదొడ్లను వారే శుభ్రం చేసుకోవాలని చెబుతూ ఉంటానని తెలిపారు. ఇతరులెవరూ మనకంటే తక్కువేం కాదని, ఏ ఒక్కరినీ తక్కువగా చూడొద్దని వారికి తరచూ చెబుతుంటానని నారాయణమూర్తి తెలిపారు.

More Telugu News