YS Sharmila: జగన్ వల్లే వైఎస్ కుటుంబం చీలిపోయింది.. దీనికి మా అమ్మ విజయమ్మ సాక్ష్యం: వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

  • మా కుటుంబం చీలిపోవడం జగన్ చేతులారా చేసుకున్నదేనన్న షర్మిల
  • జగన్ కు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు అండగా నిలబడ్డానని వ్యాఖ్య
  • బీజేపీకి జగన్ బానిసలా మారిపోయారని విమర్శ
YSR family divided just because of Jagan says YS Sharmila

తన అన్న, ఏపీ సీఎం జగన్ పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కుటుంబం చీలిపోవడానికి జగనే కారణమని ఆమె అన్నారు. దీనికి సాక్ష్యం ఆ దేవుడు, తన తల్లి విజయమ్మ అని చెప్పారు. కుటుంబం విడిపోవడం అనేది జగనన్న చేతులారా చేసుకున్నదే అని అన్నారు. వైసీపీ కోసం తాను నెలల తరబడి 3,200 కిలోమీటర్ల పాదయాత్ర చేశానని, తెలంగాణలో ఓదార్పు యాత్రను చేపట్టానని చెప్పారు. స్వలాభం కోసం చూసుకోకుండా ఎప్పుడు అవసరమొస్తే అప్పుడు జగనన్నకు అండగా నిలబడి ప్రచారం చేశానని తెలిపారు. 

తన కుటుంబం చీలిపోతుందని తెలిసి కూడా తాను కాంగ్రెస్ లో చేరానని చెప్పారు. వైసీపీ నేతలు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, విమర్శిస్తారని తనకు తెలుసని అన్నారు. రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందంటూ జగన్ నిన్న విమర్శలు గుప్పించిన నేపథ్యంలో... షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ నిన్న పెద్దపెద్ద మాటలు మాట్లాడారని.. ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టి నిర్వహించిన సదస్సులో ఏదేదో మాట్లాడారని విమర్శించారు. 

రాజధాని విషయంలో రాష్ట్రాన్ని జగన్ గందరగోళంలో పడేశారని షర్మిల దుయ్యబట్టారు. ఇప్పుడు ఏపీకి ఎన్ని రాజధానులో కూడా తెలియని పరిస్థితి ఉందని విమర్శించారు. బీజేపీకి జగన్ బానిసలా మారిపోయారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి బానిసగా మారి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను పణంగా పెట్టారని మండిపడ్డారు.

More Telugu News