kotha prabhakar reddy: రేవంత్ రెడ్డిని కలవడంపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వివరణ

  • ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేమిటని ప్రశ్నించిన కొత్త ప్రభాకర్ రెడ్డి
  • తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత కూడా గన్‌మెన్లను కుదించడంతో ఇంటెలిజెన్స్ ఐజీని కలిసినట్లు వెల్లడి
  • అదే అంశంపై రేవంత్ రెడ్డిని కలిశామన్న ప్రభాకర్ రెడ్డి
Kotha Prabhakar Reddy clarifies over meeting with revanth reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడంపై దుమారం రేగుతోంది. ఈ అంశంపై దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలుస్తున్నారని.. అలాంటప్పుడు మేం సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే తప్పేమిటని ప్రశ్నించారు. తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత కూడా తన గన్‌మెన్లను కుదించడం పట్ల... వారి పనివేళల్లో మార్పుల పట్ల ఇంటెలిజెన్స్ ఐజీని కలిసినట్లు తెలిపారు. ఇదే అంశంపై ముఖ్యమంత్రిని కలిశామన్నారు. ఇలా కలవడంలో తప్పేముంది? అన్నారు.

దుబ్బాక నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధిపై ముఖ్యమంత్రితో చర్చించేందుకు కలిసినట్లు తెలిపారు. అలాగే ప్రోటోకాల్ విషయంలో నిబంధనలు పాటించడం లేదని ఆయన దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. సీఎంను కలిసినంత మాత్రాన తమ నలుగురు ఎమ్మెల్యేలపై బురదజల్లడం మానుకోవాలని కోరారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ అడ్డా అని చెప్పారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుస్తుందని... మెదక్‌లోను పార్టీని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News