Telangana: తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకున్న నావికాదళం... వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ స్టేషన్

  • సీఎం రేవంత్ రెడ్డితో తూర్పు నావికా దళ అధికారుల భేటీ
  • దామగూడెం ఫారెస్ట్‌లో 1174 హెక్టార్ల భూముల బదిలీ
  • దేశంలోనే రెండో రాడార్ స్టేషన్
Navy Radar Station in Telangana

భారత నావికా దళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో  వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్‌ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతోంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం  వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ స్టేషన్‌ను ఉపయోగిస్తుంది. వికారాబాద్ మండలం పూడూరు సమీపంలోని దామగూడెం అటవీ ప్రాంతంలో ఈ స్టేషన్ ఏర్పాటు చేయనుంది. దేశంలోనే ఇది రెండో స్టేషన్. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఉన్న ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ రాడార్ స్టేషన్ మొట్ట మొదటిది. 1990 నుంచి అది నావికా దళానికి సేవలందిస్తోంది.

రెండో రాడార్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ అనువైన ప్రాంతంగా విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్ ఇప్పటికే గుర్తించింది. 2010 నుంచి నావికా దళం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. పర్యావరణ అనుమతులు,  క్లియరెన్స్‌లన్నీ వచ్చినప్పటికీ భూముల కేటాయింపులు జరగలేదు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ఈ రోజు నావికా దళం సిబ్బంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసింది.

నేవీ అధికారులు కార్తీక్ శంకర్, సర్కిల్ డీఈవో రోహిత్ భూపతి, కెప్టెన్ సందీప్ దాస్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. వికారాబాద్ డీఎఫ్‌వో, నావల్ కమాండ్ ఏజెన్సీ అధికారులు అటవీ భూముల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు. దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న 1174 హెక్టార్ల అటవీ భూమిని నేవీకి అప్పగించారు. 

కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నేవీ ప్రతిపాదనలకు 2014లోనే ఆమోదం తెలిపింది. అటవీ భూమి అప్పగించేందుకు రూ.133.54 కోట్ల కాంపా నిధులు, భూసంరక్షణ చర్యలకు చేపట్టే పనులకు రూ.18.56 కోట్లను నేవీ చెల్లించింది. అయితే ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూ దామగూడెం ఫారెస్ట్ ప్రోటెక్షన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన షరతులకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపాదించిన అటవీ ప్రాంతంలో ఆలయం ఉండటంతో దానికి ఇబ్బంది కలగకుండా చూడటం... ఇతరులను అనుమతించడంకు నేవీ అంగీకరించింది. దీంతో ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది.

ఇక్కడ నేవీ స్టేషన్‌తో పాటు ఏర్పడే టౌన్‌షిప్‌లో స్కూళ్లు, ఆసుపత్రులు, బ్యాంకులు, మార్కెట్లు ఉంటాయి. ఈ నేవీ యూనిట్‌లో  దాదాపు 600 మంది నావికాదళంతో పాటు ఇతర సాధారణ పౌరులు ఉంటారు. దాదాపు 2500 నుంచి 3000 మంది ఈ టౌన్‌షిప్‌లో నివసిస్తారు. విస్తృతంగా మొక్కలు నాటి పెంచడం ద్వారా ఈ ప్రాంతంలో జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు తగిన చర్యలు చేపడుతారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూ దాదాపు 27 కి.మీ రోడ్డు నిర్మిస్తారు. 2027లో ఈ కొత్త వీఎల్ఎఫ్ సెంటర్  పూర్తికానుంది.

More Telugu News