KTR: రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకి పెట్టి ప్రధాని మోదీ మనల్ని కాలుస్తారట!: కేటీఆర్ వ్యంగ్యం

  • ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పారని విమర్శ
  • కార్యకర్తల వల్లే పార్టీ పాతికేళ్లుగా బలంగా ఉందని వ్యాఖ్య
  • మనం మాట్లాడటం మొదలు పెట్టకముందే కాంగ్రెస్ ఉలిక్కిపడుతోందన్న కేటీఆర్
KTR review with nalgonda lok sabha party leaders

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి ప్రధాని నరేంద్రమోదీ బీఆర్ఎస్‌ను కాలుస్తారట అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ భవన్‌లో జరిగిన నల్గొండ లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ రెడ్డి అడ్డమైన అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. అదానీని ఓ వైపు రాహుల్ గాంధీ దొంగ అంటుంటే మరోవైపు రేవంత్ రెడ్డి మాత్రం దొర అంటున్నారని విమర్శలు గుప్పించారు. జనవరి 3న ఆదిలాబాద్‌తో ప్రారంభమైన సమావేశాలు నేడు నల్గొండతో ముగుస్తున్నాయన్నారు. ఈ రోజుతో 17 లోక్ సభ నియోజకవర్గాల సమావేశాలు పూర్తయ్యాయన్నారు.

కార్యకర్తల వల్లే పాతికేళ్లుగా పార్టీ బలంగా ఉంది

బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులని కితాబునిచ్చారు. కార్యకర్తల వల్లే పార్టీ పాతికేళ్లుగా బలంగా ఉందని చెప్పారు. గత పదహారు పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశాల తీరు చూస్తే కార్యకర్తలే పార్టీకి ధైర్యం చెప్పారని వ్యాఖ్యానించారు. నల్గొండలో ఎన్నికల ప్రచార సరళి మనకు అనుకూలంగా ఉన్నట్లుగా అనిపించిందన్నారు. ఎక్కడా ఓటమిపై అనుమానాలు రాలేదని... కానీ ఫలితాలు మరోలా వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సూర్యాపేటలో మాత్రమే గెలిచిందన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలే అభిప్రాయపడుతున్నట్లు చెప్పారు. మన ఓటమికి అనేక కారణాలు ఉన్నాయన్నారు.

కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి

ఈ పార్లమెంట్ సన్నాహక సమావేశాలు కేవలం ఆరంభమేనని... ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షలు ప్రారంభమవుతాయన్నారు. సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టలేకపోయామని కేటీఆర్ అన్నారు. ప్రతిపక్షాలు అభూతకల్పనలు, అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. మనం ఇంకా మాట్లాడటం మొదలు పెట్టనే లేదు.. కాంగ్రెస్ వాళ్లు ఉలిక్కి పడుతున్నారన్నారు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలన్నారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ కూడా ఊహించలేదన్నారు. అందుకే ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు. హామీలకు కాంగ్రెస్ పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తోందని.. కానీ వదిలేది లేదన్నారు.

కార్యకర్తలు ఉదాసీన వైఖరిని.. మీమాంసను వీడాలని.. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడారు? ఇప్పుడేం చేస్తున్నారు? ప్రజలకు విడమరిచి చెప్పాలన్నారు. కరెంట్ బిల్లు కట్టవద్దని మనం చెప్పడం కాదని.. మంత్రి కోమటిరెడ్డే గత నవంబర్ నెలలోనే చెప్పారని గుర్తు చేశారు. నల్గొండ ప్రజలు తమ కరెంట్ బిల్లులను కోమటిరెడ్డికి పంపించాలని సూచించారు. అప్పుడే కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. సాగర్ ఆయకట్టుకు కాంగ్రెస్ పాలనలో మొదటిసారి క్రాప్ హాలీడే ప్రకటించే దుస్థితి వచ్చిందన్నారు. కృష్ణా రివర్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించి తెలంగాణ జట్టును కాంగ్రెస్ కేంద్రం చేతిలో పెడుతోందని ఆరోపించారు. శ్రీరాంసాగర్ చివరి ఆయకట్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతోందని మండిపడ్డారు.

కాంగ్రెస్, బీజేపీ మైత్రి బయటపడింది

కాంగ్రెస్, బీజేపీ అక్రమ బంధం నల్గొండ మున్సిపాలిటీ అవిశ్వాసంలో బయటపడిందన్నారు. మైనార్టీ సోదరులకు కాంగ్రెస్ బీజేపి అక్రమ సంబంధం గురించి చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉంది.. ఈ పరిస్థితిని పార్లమెంటు ఎన్నికల్లో సానుకూలంగా మలుచుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికే అనేక వర్గాలు దూరం అయ్యాయని వ్యాఖ్యానించారు. సమష్టిగా పని చేసి నల్గొండ పార్లమెంట్ సీటును గెలుద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.

More Telugu News