Pawan Kalyan: జనంలోకి పవన్ కల్యాణ్... కార్యాచరణ సిద్ధమైందన్న నాదెండ్ల మనోహర్

  • ఏపీలో ఎన్నికల వాతావరణం
  • ఈ నెలాఖరు నుంచి పవన్ క్ష్రేతస్థాయి పర్యటనలు
  • నేడు జోనల్ కమిటీలకు దిశానిర్దేశం చేసిన నాదెండ్ల 
  • పవన్ పర్యటనల్లో జోనల్ కమిటీలదే కీలక పాత్ర అని స్పష్టీకరణ
Pawan Kalyan will tour in AP

ఏపీ ఎన్నికల సమరాంగణం క్రమంగా వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. తాజాగా, ఈ నెలాఖరు నుంచి జనంలోకి వెళ్లాలని జనసేనాని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 

క్షేత్రస్థాయి పర్యటనలకు పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. రోజుకు మూడు సభలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు వివరించారు. పవన్ పర్యటనల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు కూడా ఉంటాయని నాదెండ్ల పేర్కొన్నారు. 

దాదాపు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాలను కవర్ చేసేలా బహిరంగ సభలు ఉంటాయని వెల్లడించారు. మరో రెండు నెలలు శక్తివంచన లేకుండా శ్రమిస్తే విజయం జనసేన-టీడీపీ కూటమిదేనని శ్రేణులకు స్పష్టం చేశారు. 

రాష్ట్రాన్ని 5 జోన్ లు విభజించి, బాధ్యతలు అప్పగించామని తెలిపారు. పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయి పర్యటనలకు వచ్చినప్పుడు... బాధితులతో పవన్ కల్యాణ్ మాట్లాడే విధంగా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత జోనల్ కమిటీ సభ్యులదేనని నాదెండ్ల స్పష్టం చేశారు. ఇవాళ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ జనసేన జోనల్ కమిటీలతో సమావేశమై వారికి దిశా నిర్దేశం చేశారు.

More Telugu News