VHP: త్వరలో ఒవైసీ కూడా రామనామం జపిస్తారు: వీహెచ్‌పీ

  • ఓ పద్ధతి ప్రకారం బాబ్రీ మసీదును ముస్లింలకు దూరం చేశారన్న అసదుద్దీన్ ఒవైసీ
  • ఒవైసీ వ్యాఖ్యలపై భగ్గుమన్న వీహెచ్‌పీ ప్రతినిధి 
  • గత 500 ఏళ్లలో ఒవైసీ పూర్వీకులెవరైనా అయోధ్యను సందర్శించారా? అని ప్రశ్న
  • త్వరలో ఆ పార్టీ వారు రామభక్తులవుతారని వ్యాఖ్య
Owaisi will soon chant Ram Naam VHP

అయోధ్య శ్రీరామ మందిరం విషయంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై విశ్వ హిందూ పరిషద్ (వీహెచ్‌పీ) మండిపడింది. త్వరలో అసదుద్దీన్ కూడా రామనామం జపిస్తారని వ్యాఖ్యానించింది. 

శనివారం అసదుద్దీన్ కర్ణాటకలో పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బాబ్రీ మసీదును ఓ పద్ధతి ప్రకారం ముస్లింలకు దూరం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. 1992లో మసీదును కూలగొట్టి ఉండకపోతే ముస్లింలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేవారు కాదని అభిప్రాయపడ్డారు. ‘‘500 ఏళ్ల పాటు బాబ్రీ మసీదులో ముస్లింలు నమాజ్ చేశారు. కాంగ్రెస్ నేత జీబీ పంత్ సీఎం‌గా ఉన్న కాలంలో మసీదులో విగ్రహాలు పెట్టారు. ఆ తరువాత సీఎం మసీదును మూసేశారు. అనంతరం, అక్కడ పూజలు ప్రారంభమయ్యాయి. వీహెచ్‌పీ ఏర్పాటైన కాలంలో అక్కడ రామమందిరం లేనేలేదు’’ అని ఒవైసీ చెప్పుకొచ్చారు.   

కాగా, ఒవైసీ వ్యాఖ్యలపై వీహెచ్‌పీ ప్రతినిధి భగ్గుమన్నారు. ‘‘గత 500 సంవత్సరాల్లో మీ పూర్వీకులెవరైనా అయోధ్యను సందర్శించారా? ఒవైసీ యూకేలో బారిస్టర్ చేశారు. మరి, మసీదును రక్షించుకునేందుకు ఆయన కోర్టును ఎందుకు ఆశ్రయించలేదు? ఈ ముస్లిం పార్టీ అర్థం చేసుకోవాల్సిందేంటంటే త్వరలో వీరూ రామ భక్తులుగా మారతారు. రామనామం జపిస్తారు’’ అని వ్యాఖ్యానించారు.

More Telugu News