Ayodhya Ram Mandir: అయోధ్య వేడుకపై తప్పుడు సమాచారం వ్యాప్తి పట్ల కేంద్రం అప్రమత్తత!

  • సోషల్ మీడియాలో తప్పుడు సమాచార వ్యాప్తిపై కేంద్రం అలర్ట్
  • తప్పుడు లేదా మోసపూరిత సమాచారం రాకుండా చూడాలని ఆదేశాలు
  • మీడియా సంస్థలకు, సోషల్ మీడియా మాధ్యమాలకు కేంద్రం ఆదేశాలు
Centre alert on Ayodhya Ram Temple fake inputs

అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం కోట్లాదిమంది ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో శ్రీరాముడి దర్శనం, ప్రసాదం, ఫొటోలు, విగ్రహం పేరుతో కొంతమంది తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు సమాచారం వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అయోధ్య రామమందిరంపై ఎలాంటి తప్పుడు లేదా మోసపూరిత సమాచారం రాకుండా చూడాలని అన్ని మీడియా సంస్థలకు, సోషల్ మీడియా మాధ్యమాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

అయోధ్య రామమందిరలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో... ధ్రువీకరించని లేదా రెచ్చగొట్టే లేదా నకిలీ సందేశాలు వ్యాప్తి చెందుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇలా ఎక్కువగా జరుగుతోందని, ఇలాంటి వ్యవహారం శాంతిభద్రతలకు, మతసామరస్యానికి విఘాతం కలిగిస్తుందని తెలిపింది. ఇలాంటి తప్పుడు, మోసపూరిత సమాచారాన్ని ప్రచురించకుండా... ప్రసారం చేయకుండా వార్తాపత్రికలు, ప్రయివేటు శాటిలైట్ టీవీ ఛానళ్లు, డిజిటల్ మీడియా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. సోషల్ మీడియా వేదికలు సంబంధిత కంటెంట్‌ను కట్టడి చేయాలని ఆదేశించింది.

More Telugu News