Ayodhya Live: అయోధ్య వేడుకలు దేశంలోని పలు థియేటర్లలో లైవ్.. పాప్ కార్న్ ఫ్రీ

  • పీవీఆర్, ఐనాక్స్ లలో రూ. 100 టికెట్
  • చారిత్రక ఘట్టం కావడంతో ప్రత్యక్ష ప్రసారం
  • ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు లైవ్
Ram Mandir Inauguration Live Stream

అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఈ నెల 22న నిర్వహించే ఈ మహాక్రతువును ప్రత్యక్షంగా వీక్షించాలని ప్రతీ రామ భక్తుడూ కోరుకుంటున్నాడు. అయితే, ఆంక్షల కారణంగా అయోధ్యకు వెళ్లడం అందరికీ సాధ్యం కావడంలేదు. ఈ క్రమంలో అయోధ్యలో జరిగే ప్రాణప్రతిష్ఠ క్రతువును టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీనికి అదనంగా దేశవ్యాప్తంగా ఉన్న పలు థియేటర్లలోనూ ఈ వేడుకలను లైవ్ ప్రసారం చేయనున్నాయి.

ప్రముఖ థియేటర్లు పీవీఆర్, ఐనాక్స్ లు మొత్తం 100 స్క్రీన్లపై ఈ లైవ్ ప్రదర్శించనున్నట్లు తెలిపాయి. రూ.100 టికెట్ తో ప్రేక్షకులను లోపలికి అనుమతించనున్నట్లు వెల్లడించాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు లైవ్ కొనసాగనుందని, థియేటర్లకు వచ్చిన భక్తులకు పాప్ కార్న్, కూల్ డ్రింక్ ను ఉచితంగా అందిస్తామని పీవీఆర్, ఐనాక్స్ నిర్వాహకులు తెలిపారు.

రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఓ చారిత్రక ఘట్టమని పీవీఆర్ ఐనాక్స్ కో-సీఈవో గౌతమ్ దత్తా పేర్కొన్నారు. అందుకే ఈ వేడుకను పెద్ద తెరపై చూసేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈ నెల 22న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అయోధ్య వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేసేలా పీవీఆర్‌, ఐనాక్స్ ఏర్పాట్లు చేశాయి. దేశంలోని 70 నగరాలలో 170 కేంద్రాలలోని 100 స్క్రీన్లపై ఈ ప్రసారాలు చేపట్టనున్నట్లు తెలిపాయి. పెద్ద స్క్రీన్లపై ఈ వేడుకలను చూసేందుకు ఆయా మల్టీప్లెక్స్ ల అధికారిక వెబ్ సైట్ లలో, బుక్ మై షో ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

More Telugu News