Ramanaidu Studio: రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారం.. స్టే విధించిన సుప్రీంకోర్టు

  • 2003లో విశాఖలో రామానాయుడు స్టూడియోకు 35 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
  • లేఔట్ గా మార్చి అమ్ముకునేందుకు స్టూడియో అధినేతను అనుమతించిన వైసీపీ ప్రభుత్వం
  • సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు
Setback to AP Govt in Supreme Court in Ramanaidu Studio case

విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో భూములను లేఔట్ గా మార్చి అమ్మడంపై స్టే విధించింది. 2003 సెప్టెంబర్ 13న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్న అవసరాలు మినహా ఇతర కార్యకలాపాలకు ఆ భూములు వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులపై మార్చి 11లోపు స్పందించాలని ఆదేశించింది. 


వివాదం విషయంలోని వెళ్తే... రామానాయుడు స్టూడియోకు సినీ అవసరాల కోసం 2003లో అప్పటి ప్రభుత్వం విశాఖలో 35 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోస్టల్ నిబంధనలకు విరుద్ధంగా లేఔట్ గా మార్చి ఇతర కార్యకలాపాలకు వినియోగించుకునేందుకు స్టూడియో అధినేతను అనుమతించింది. ఈ వ్యవహారాన్ని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో... ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

పిటిషన్ పై విచారణను జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ అభయ్ ఎస్ ఓఖాల ధర్మాసనం చేపట్టింది. రామానాయుడు స్టూడియోకి భూమిని ఎందుకు కేటాయించారు? ఇప్పుడు వేరే కార్యకలాపాలు చేపట్టారా? అని పిటిషనర్ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. సినీ స్టూడియో నిర్మాణానికి భూమిని కేటాయించారని.. దానికి అనుగుణంగా స్టూడియో నిర్మాణం చేపట్టకుండా... లేఔట్ వేసి అమ్మకాలకు సిద్ధం చేశారని కోర్టుకు న్యాయవాది తెలిపారు. దీంతో స్టే విధించిన కోర్టు ప్రభుత్వం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

వాస్తవానికి స్టూడియోకు ఇచ్చిన స్థలంలో లేఔట్ వేసి ఇళ్లను నిర్మించడం చట్ట విరుద్ధం. అయితే దీనికి జిల్లా కలెక్టర్ కూడా ఎన్ఓసీ ఇవ్వడం గమనార్హం. దగ్గుబాటి సురేశ్ బాబు పేరు మీదనే లేఔట్ వేశారు.  

More Telugu News