Mahua Moitra: మీరు ఖాళీ చేస్తారా.. బలవంతంగా ఖాళీ చేయించమంటారా? అంటూ కేంద్రం నోటీసులు.. టీఎంసీ నాయకురాలు మొయిత్రా ఏం చేశారంటే..!

  • టీఎంసీ నేత మహువా మొయిత్రా ఎంపీ సభ్యత్వంపై ఇటీవల వేటు వేసిన పార్లమెంట్
  • ప్రభుత్వ బంగళా ఖాళీ చేయడంపై ఇప్పటికే పలుమార్లు నోటీసులు
  • తాజా నోటీసులపై మరోమారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన మొయిత్రా
Mahua Moitras Move After Centres Eviction Notice

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకురాలు మహువా మొయిత్రాపై కేంద్రం సీరియస్ అయింది. ఆమె పార్లమెంట్ సభ్యత్వంపై వేటు పడడంతో ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయాలంటూ పలుమార్లు నోటీసులు పంపినా ఎంపీ పట్టించుకోకపోవడంతో మరో నోటీసు పంపింది. ప్రభుత్వం ఇచ్చిన బంగళాను మీ అంతట మీరు ఖాళీ చేస్తే మంచిది.. లేదంటే బలవంతంగా ఖాళీ చేయించాల్సి ఉంటుందంటూ తాజా నోటీసుల్లో పేర్కొంది. వెంటనే ప్రభుత్వ బంగళాను ఖాళీ చేసి అప్పగించాలంటూ డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు.

ఈ నోటీసులపై మహువా మొయిత్రా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయంపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా.. ప్రస్తుతానికి అదే బంగళాలో ఉండేందుకు అనుమతించాలంటూ అధికారులను రిక్వెస్ట్ చేసుకోవాలంటూ కోర్టు సూచించింది. తాజా నోటీసులపై మొయిత్రా మరోమారు హైకోర్టు మెట్లెక్కారు.

బెంగాల్ కు చెందిన మహువా మొయిత్రా టీఎంసీ టికెట్ పై పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. అయితే, పార్లమెంట్ సభ్యులకు ఇచ్చే లాగిన్ వివరాలను తన స్నేహితుడితో పంచుకుందని, లోక్ సభలో పలు ప్రశ్నలు అడిగేందుకు ఆమె డబ్బులు పుచ్చుకుందని ఆరోపణలు వచ్చాయి. ప్రాథమిక ఆధారాలు పరిశీలించిన పార్లమెంట్.. ఈ విషయంపై విచారణకు ఓ కమిటీని నియమించింది. కమిటీ అందించిన రిపోర్టు ఆధారంగా మొయిత్రా సభ్యత్వంపై స్పీకర్ వేటు వేశారు.

ఎంపీగా ఎన్నికైన సభ్యులకు ఢిల్లీలో ఉండేందుకు కేంద్రం బంగళాలను కేటాయిస్తుంది. మొయిత్రా కూడా ప్రస్తుతం ప్రభుత్వ బంగళాలోనే ఉంటున్నారు. అయితే, ఆమె సభ్యత్వంపై వేటు పడడంతో వెంటనే ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయాలని డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ డిపార్ట్ మెంట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. పార్లమెంట్ సభ్యత్వంపై విధించిన సస్పెన్షన్ వేటుపై మొయిత్రా న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో తాను అదే బంగళాలో ఉండేందుకు అనుమతించేలా ఆదేశించాలని తాజాగా మొయిత్రా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

More Telugu News