గాల్వాన్ వ్యాలీ ఘర్షణ తర్వాత ఎల్ఏసీ వెంబడి మరో రెండుసార్లు ఘర్షణపడ్డ భారత్, చైనా బలగాలు!

  • ఆర్మీ వెస్ట్రన్ కమాండ్ ‘శౌర్య పురస్కారాల ప్రదానం’ కార్యక్రమం ద్వారా వెలుగులోకి వచ్చిన ఘర్షణ
  • ఎల్ఏసీ వెంబడి చైనా బలగాల దూకుడుని అడ్డుకున్న సైనికులకు పురస్కారాలు
  • యూట్యూబ్‌లో వీడియోను షేర్ చేసి.. తర్వాత డిలీట్ చేసిన ఆర్మీ
భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన ‘2020 గాల్వాన్ వ్యాలీ’ ఘటన తర్వాత వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ఇరు బలగాల మధ్య మరో రెండు సార్లు ఘర్షణలు జరిగినట్టు బయటపడింది. సెప్టెంబర్ 2021, నవంబర్ 2022లలో భారత్, చైనా బలగాల మధ్య ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయని వెల్లడైంది. భారత ఆర్మీ వెస్ట్రన్ కమాండ్ గతవారం సైనికులకు శౌర్య పురస్కారాల ప్రదాన కార్యక్రమం వేదికగా ఈ ఘర్షణలు బయటపడ్డాయి. సరిహద్దు వెంబడి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దుందుడుకు చర్యలను ధైర్య సాహసాలతో ఎదుర్కొన్న సైనికులకు శౌర్య పురస్కారాల ప్రదానం చేసినట్టు కార్యక్రమం ద్వారా తెలిసింది.

 హర్యానాలోని చండీమందిర్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఆర్మీ వెస్ట్రన్ కమాండ్ శౌర్య పురస్కారాల అందజేత కార్యక్రమానికి సంబంధించిన వీడియోను కూడా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. అయితే తర్వాత ఈ వీడియోను డిలీట్ చేసింది. జనవరి 13న వీడియోను అప్‌లోడ్ చేసి 15న తొలగించింది. అయితే ఈ ఘర్షణలపై భారత సైన్యం స్పందించలేదు. కాగా జూన్ 2020లో గాల్వాన్ లోయ ఘర్షణతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సరిహద్దు వెంబడి ఘర్షణపూర్వక వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.

Galvan Valley clash
india vs China
Indian army
LAC
Indian and Chinese troops

More Telugu News