guvvala balaraju: హత్యా రాజకీయాలను జూపల్లి నియంత్రించాలని మాత్రమే కేటీఆర్ అన్నారు: గువ్వల బాలరాజు వివరణ

  • కాంగ్రెస్‌ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్న గువ్వల
  • జూపల్లిపై కేటీఆర్ ఆరోపణలు చేయలేదని వివరణ  
  • ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వెనకేసుకు రావడం సరికాదని హితవు
Guvvala Balaraju fires at Minister Jupalli

మంత్రిగా జూపల్లి కృష్ణారావు హత్యా రాజకీయాలను నియంత్రించాలని మాత్రమే కేటీఆర్ సూచించారని.. కానీ ఆయనపై ఎలాంటి ఆరోపణలు చేయలేదని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్‌ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ దాహం ఒక హత్యతో తీరేలా కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హత్యా రాజకీయాలకు తెర తీసిందని ధ్వజమెత్తారు. మంత్రిగా జూపల్లి హత్యా రాజకీయాలను నియంత్రించాలని కేటీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కానీ ఆయనపై ఆరోపణలు చేయలేదన్నారు.

జూపల్లి నిన్న మాట్లాడుతూ ఎక్కడెక్కడో జరిగిన సంఘటనలను ప్రస్తావిస్తూ ఇష్టారీతిన ఆరోపణలు చేశారని విమర్శలు గుప్పించారు. గతంలో కేసీఆర్ హయాంలో అయిదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన జూపల్లి ఇప్పుడు లేనిపోని అంశాలను తెరపైకి తీసకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వెనుకేసుకు రావడం సరికాదని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. మాజీ సైనికుడు హత్యకు గురైతే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జూపల్లి వారి కుటుంబాన్ని పరామర్శించలేదని ఆరోపించారు.

More Telugu News