Mumbai Indians: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌పై ముంబై ఇండియన్స్ పోస్ట్.. అసంతృప్తితో రగిలిపోతున్న రోహిత్ శర్మ ఫ్యాన్స్!

  • ఇంగ్లండ్‌తో ఆడబోయే టీమిండియా ఇదేనంటూ ముంబై ఇండియన్స్ పోస్ట్
  • పోస్టులో రోహిత్ శర్మ ఫొటో లేకపోవడంతో మండిపడుతున్న హిట్‌మ్యాన్ ఫ్యాన్స్
  • కెప్టెన్ ఫొటో కనిపించకపోవడంపై మండిపాటు
  • కేఎల్ రాహుల్, అయ్యర్, బుమ్రా ఫొటోలతో పోస్ట్ షేర్ చేసిన ముంబై ఇండియన్స్
Mumbai Indians post on India vs England Test series and Rohit Sharma fans are unhappy with this

ఐపీఎల్‌కి, అంతర్జాతీయ క్రికెట్‌‌కు మధ్య ఎలాంటి సంబంధం ఉండదు. ఒకదానికొకటి పూర్తిగా విభిన్నమైనవి. అయితే క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆకర్షించేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు టీమిండియాకు సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటాయి. భారత్ విజయాలు, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనలకు సంబంధించిన పోస్టులు పెడుతుంటాయి. ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరగనున్న టెస్ట్ సిరీస్ తొలి రెండు మ్యాచ్‌లకు బీసీసీఐ ఇటీవల జట్టుని ప్రకటించిన నేపథ్యంలో ముంబై ఇండియన్స్ శనివారం స్పందించింది. ఇందుకు సంబంధించిన ఎక్స్‌లో షేర్ చేసిన పోస్టు రోహిత్ శర్మ ఫ్యాన్స్‌‌ అసంతృప్తికి కారణమవుతోంది.

తొలి రెండు టెస్టులకు ఎంపికైన జట్టు సభ్యుల పేర్లను ముంబై ఇండియన్స్ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసింది. ‘మీ అభిప్రాయం ఏంటో చెప్పండి’ అంటూ ఫ్యాన్స్‌ను కోరింది. ‘వన్ ఫ్యామిలీ’, ‘ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా’ అనే హ్యాష్‌ ట్యాగ్‌లను జోడించింది. అయితే ఆ పోస్టర్‌పై కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్‌ల ఫొటోలు మాత్రమే కనిపించాయి. కెప్టెన్ అయినప్పటికీ రోహిత్ శర్మ ఫొటో లేదు. దీంతో హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. కెప్టెన్ ఫొటో లేకపోవడం ఏంటని మండిపడ్డారు. కామెంట్ల రూపంలో తమ అసంతృప్తి తెలియజేస్తున్నారు. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్‌ స్థానంలో హార్ధిక్ పాండ్యాకు అవకాశం కల్పించిన నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామంపై ఫ్యాన్స్ ఆగ్రహం చేస్తున్నారు.

కాగా ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్ తొలి రెండు మ్యాచ్‌లకు టీమిండియాను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహించనుండగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇదిలావుంచితే కేఎల్ రాహుల్, కేఎస్ భరత్‌లకు తోడు మూడవ ఛాయిస్ వికెట్ కీపర్‌గా యువ ఆటగాడు ధ్రువ్ జురెల్‌కు సెలెక్టర్లు తొలిసారి అవకాశం కల్పించారు.

More Telugu News