mallu ravi: మా డీఎన్ఏలోనే రాముడి సందేశం ఉంది: కాంగ్రెస్ నేత మల్లు రవి

  • రాముడి గుడికి రాజీవ్ గాంధీ హయాంలోనే ఫౌండేషన్ వేశామన్న మల్లు రవి
  • కోర్టు కేసుల కారణంగా తాము కట్టలేదని వెల్లడి
  • మహాత్మా గాంధీ చెప్పిన మాటలను ఈ నెల 22న గుర్తు చేసుకోవాలని సూచన
Mallu Ravi says Congress DNA have Lord Rama message

జాతిపిత మహాత్మాగాంధీ చెప్పిన విషయాన్ని ఈ నెల 22వ తేదీన ప్రతి ఇంట్లో గుర్తు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... శ్రీరాముడి గుడిని అధికార పార్టీ కడుతున్నట్లుగా చెబుతోందని... కానీ ఆ ప్రభువు గుడికి రాజీవ్ గాంధీ హయాంలోనే ఫౌండేషన్ వేశామని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. కోర్టు కేసుల కారణంగా తాము కట్టలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ డీఎన్‌ఏలోనే ఆ రాముడి సందేశం ఉందని వ్యాఖ్యానించారు. మహాత్మాగాంధీ చెప్పింది ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు. 'రఘుపతి రాఘవ రాజారామ్ పతిత పావన సీతారాం' అని గాంధీ చెప్పారన్నారు.

భద్రాచలంలో ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం జరుగుతోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రాముడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బేగంబజార్‌లో ఇటీవల తాము ఏపీ ఉపముఖ్యమంత్రిపై చేసిన ఫిర్యాదుకు ఎఫ్ఐఆర్ నమోదు అయిందని తెలిపారు. అధిష్ఠానం ఆదేశిస్తే తాను నాగర్‌కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ 16 సీట్లను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News