Raghu Rama Krishna Raju: సంక్రాంతికి సొంతూరుకు రఘురామ... అరెస్ట్ చేయవద్దన్న ఏపీ హైకోర్టు

  • నిన్న ఏపీ హైకోర్టులో రఘురామ పిటిషన్
  • సంక్రాంతికి ఊరెళుతున్నానని, అరెస్ట్ చేయకుండా చూడాలని విన్నపం
  • నేడు ఏపీ హైకోర్టులో విచారణ
  • రఘురామ పిటిషన్ కు విచారణ అర్హత లేదన్న ప్రభుత్వ న్యాయవాది
  • 41ఏ ప్రొసీజర్ ఫాలో కావాలన్న ఏపీ హైకోర్టు
AP High Court orders protect Raghurama from arrest

ఈ సంక్రాంతి పండుగకు సొంతూరుకు వెళుతున్నానని, తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనపై ఇప్పటికే 11 కేసులు నమోదు చేశారని, మరో కేసు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందని రఘురామ నిన్న పిటిషన్ దాఖలు చేశారు. తనకు రక్షణ కల్పించాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. 

రఘురామ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం రఘురామకృష్ణరాజుకు ఊరట కలిగించే నిర్ణయం వెలువరించింది. 41ఏ సెక్షన్ విధివిధానాలను తప్పనిసరిగా అనుసరించాలని, అరెస్ట్ నుంచి రఘురామకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో ఓ వ్యక్తి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ హైకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. 

వాదనల సందర్భంగా రఘురామ న్యాయవాదులు స్పందిస్తూ... రఘురామను గతంలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని, ఆయనను చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. మరో అక్రమ కేసుతో అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలిపారు. సీఐడీ అధికారులు నిబంధనల ప్రకారం నడుచుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 

ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ... రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదని అన్నారు. ఓ కేసు నమోదయ్యాక, ఏడేళ్ల లోపు శిక్ష పడే సెక్షన్లు ఉన్నప్పుడే 41ఏ కింద నిబంధనలు వర్తిస్తాయని కోర్టుకు తెలిపారు. ఇప్పుడేమీ రఘురామపై కొత్త కేసులు నమోదు చేయలేదని వెల్లడించారు.

More Telugu News