రామమందిర ప్రాణప్రతిష్ఠకు నాకు ఆహ్వానం అందలేదు: అఖిలేశ్ యాదవ్

  • తనకు కొరియర్ ద్వారా ఆహ్వానం పంపిస్తే ఆధారాలు చూపించాలని అఖిలేశ్ యాదవ్ డిమాండ్
  • పంపినా తన చిరునామాకే పంపించారా? అన్న అఖిలేశ్  
  • ఆహ్వానితుల జాబితాలో అఖిలేశ్ యాదవ్ పేరు ఉందన్న విహెచ్‌పి
ఈ నెల 22న అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి తనకు ఇప్పటి వరకు ఆహ్వానం అందలేదని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వ్యక్తిగతంగా లేదా కొరియర్ ద్వారా... ఏ రూపంలోనూ ఆహ్వానం రాలేదన్నారు. ఒకవేళ తనకు పోస్ట్ ద్వారా పంపినట్లు ఉంటే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం సమాజ్‌వాది పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... తనను ఆహ్వానించకుండా వారు అవమానించారని మండిపడ్డారు. తనకు ఇప్పటి వరకు ఆహ్వానం రాలేదన్నారు. పోస్టల్ ద్వారా పంపించి ఉంటారని ఓ మీడియా ప్రతినిధి చెప్పగా... అలా పంపిస్తే ఆధారాలు చూపించాలన్నారు. ఒకవేళ తన చిరునామాకే పంపించారా? అన్నది చూడాలన్నారు.

ఆహ్వానితుల జాబితాలో అఖిలేశ్ పేరు ఉంది: విహెచ్‌పి

శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ వేడుకకు అఖిలేశ్ యాదవ్‌ను ఆహ్వానించారా? అని విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్‌ను మీడియా ప్రశ్నించింది. ఆయనకు ఆహ్వానం అందిందో లేదో తాను ఎలా ధ్రువీకరించనని... ఆహ్వానితుల జాబితాలో మాత్రం అఖిలేశ్ పేరు ఉందని స్పష్టం చేశారు.


More Telugu News

Akhilesh Yadav Samajwadi Party Ayodhya Ram Mandir Ayodhya Temple Trust Ayodhya Ram Temple