Narendra Modi: పాక్ వైపు 9 క్షిపణులను మోహరించిన భారత్... అర్ధరాత్రి వేళ మోదీకి ఫోన్ చేసేందుకు యత్నించిన ఇమ్రాన్ ఖాన్!: నాటి విషయం తాజాగా వెలుగులోకి

  • భారత్-పాక్ సంబంధాలపై పుస్తకం రాసిన అజయ్ బిసారియా
  • గతంలో పాక్ లో భారత హైకమిషనర్ గా పనిచేసిన బిసారియా
  • 2019లో పుల్వామా ఉగ్రదాడి
  • ప్రతిగా బాలాకోట్ లో సర్జికల్ స్ట్రయిక్స్ చేపట్టిన భారత్
  • పాక్ సైన్యానికి బందీగా దొరికిన అభినందన్ వర్ధమాన్
When Imran Khan try to talk PM Modi at midnight

సీనియర్ దౌత్యవేత్త అజయ్ బిసారియా భారత్-పాకిస్థాన్ సంబంధాలపై తాజాగా రాసిన పుస్తకంలో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. 

2019లో పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్థాన్ లోని బాలాకోట్ లోని ఉగ్రస్థావరాలపై సర్జికల్ దాడులు చేపట్టింది. ఆ తర్వాత భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తన మిగ్-21 యుద్ధ విమానంతో వీరోచితంగా పోరాడి పాక్ సేనలకు చిక్కాడు. 

ఈ ఘటన అనంతరం ఎలాంటి పరిణామాలు జరిగాయో అజయ్ బిసారియా తన పుస్తకంలో పేర్కొన్నారు. ఆ సమయంలో అజయ్ బిసారియా పాకిస్థాన్ లో భారత హైకమిషనర్ గా ఉన్నారు. భారత్ లో పాక్ హైకమిషనర్ గా వ్యవహరిస్తున్న సొహైల్ మహమ్మద్ అప్పుడు ఇస్లామాబాద్ లోనే ఉన్నారు. 

"అభినందన్ వర్ధమాన్ ను పాక్ సైన్యం బంధించిన విషయం తెలిశాక భారత్ ఆగ్రహావేశాలతో రగిలిపోయింది. వెంటనే పాకిస్థాన్ దిశగా 9 మిస్సైళ్లను మోహరించింది. ఈ పరిణామంతో పాక్ వణికిపోయింది. ఫిబ్రవరి 27న పాక్ హైకమిషనర్ సొహైల్ మహమ్మద్ నన్ను సంప్రదించారు. అప్పుడు సమయం అర్ధరాత్రి. 

భారత ప్రధాని మోదీతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడాలనుకుంటున్నారు అని ఆయన నాతో చెప్పారు. ఈ విషయాన్ని నేను ఢిల్లీలోని ఉన్నతాధికారులకు తెలియజేశాను. అప్పుడు వారు...  ఫోన్ లో మాట్లాడేందుకు ఈ సమయంలో ప్రధాని మోదీ అందుబాటులో ఉండరని చెప్పారు. నేను ఇదే విషయాన్ని సొహైల్ మహ్మద్ కు తెలియజేశాను. పాకిస్థాన్ అత్యవసరంగా ఏదైనా చెప్పాలనుకుంటే హైకమిషనర్ హోదాలో ఉన్న నాకు చెప్పాలని ఢిల్లీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పాక్ వర్గాలకు వివరించాను. ఆ తర్వాత పాకిస్థాన్ అధికారుల నుంచి నాకు ఎలాంటి సమాచారం లేదు. 

ఒకేసారి 9 క్షిపణులను గురిపెట్టే సరికి పాక్ బాగా భయపడిపోయింది. అభినందన్ వర్ధమాన్ ను విడిచిపెట్టి మంచి పనిచేసింది. లేకపోతే ఆ రాత్రి పాకిస్థాన్ కు భయంకరమైన రాత్రిగా మిగిలిపోయేది" అని అజయ్ బిసారియా తన పుస్తకంలో వివరించారు.

More Telugu News