BTS Stars: 'బీటీఎస్' స్టార్లను కలిసేందుకు ఇంటినుంచి పారిపోయిన తమిళనాడు అమ్మాయిలు.. చివరికి ఇంటికి చేర్చిన పోలీసులు!

  • ఈరోడ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికలు
  • బీటీఎస్ స్టార్లను కలిసేందుకు పక్కా ప్రణాళిక
  • తూత్తుకుడి, లేదంటే విశాఖపట్టణం నుంచి ఓడలో సౌత్ కొరియా వెళ్లాలని నిర్ణయం
  • చెన్నై వచ్చి హోటల్ లో ఉండి తెల్లారాక మనసు మార్చుకున్న అమ్మాయిలు
  • కాట్పాడిలో రైలు మిస్ కావడంతో పోలీసులకు దొరికి సురక్షితంగా ఇంటికి
3 Schoolgirls Who Fled Home To Meet BTS In South Korea Found

బీటీఎస్‌గా చిరపరిచితమైన కొరియన్ పాప్ బ్యాండ్ స్టార్లంటే ఆ అమ్మాయిలకు పిచ్చి... వాళ్లంటే పడిచస్తారు. ఆ వెర్రి అభిమానం వాళ్లను ఇంటినుంచి పారిపోయేలా చేసింది. ఆ స్టార్లను కలిసేందుకు దక్షిణ కొరియాకు వెళ్లిపోవాలని తమిళనాడుకు చెందిన ఈ ముగ్గురమ్మాయిలు ఎవరికీ చెప్పాపెట్టకుండా ఇంటి నుంచి పారిపోయారు. అయితే, మధ్యలోనే మనసు మార్చుకుని.. పోలీసుల సహాయంతో.. తిరిగి ఇంటికి సురక్షితంగా చేరుకున్నారు. ఈరోడ్‌ సమీపంలోని ఓ గ్రామంలో ప్రభుత్వ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న ఈ బాలికల వయసు 13 ఏళ్లు మాత్రమే.

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో బీటీఎస్ స్టార్లను కలవాలని నిర్ణయించుకున్న అమ్మాయిలు తొలుత తమిళనాడులోని తూత్తుకుడి, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం ఓడరేవులను తమ ప్రయాణానికి  షార్ట్‌లిస్ట్ చేశారు. పాస్ పోర్టులు, సరిపడా డబ్బు చేతిలో లేకపోయినా.. చివరికి విశాఖపట్టణం నుంచి ఓడలో సౌత్ కొరియా చేరుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ నెల 4న ఈరోడ్ నుంచి రైలు ద్వారా చెన్నై చేరుకున్నారు. మరోవైపు, పిల్లలు కనిపించకపోవడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. 

చెన్నైలో అడుగుపెట్టిన అమ్మాయిల చేతిలో ఉన్నది రూ.14 వేలు మాత్రమే. దాంతోటే సౌత్ కొరియా చేరుకోవచ్చని నమ్మారు. చెన్నై చేరుకున్నాక గురువారం రాత్రి అతికష్టం మీద హోటల్ రూం సంపాదించారు. శుక్రవారం సౌత్ కొరియా వెళ్లాలని భావించిన్పటికీ ఎందుకనో వెనక్కి తగ్గారు. చివరికి ఇంటికి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని చెన్నైలో రైలు ఎక్కారు. 

వెల్లూరులోని కాట్పాడి రైల్వే స్టేషన్‌లో అర్ధరాత్రి ఆహారం కోసం రైలు దిగి ట్రైన్ మిస్సయ్యారు. అమ్మాయిలను గుర్తించిన పోలీసులు వారితో మాట్లాడి, వివరాలు రాబట్టారు. అలాగే, చైల్డ్‌లైన్ అధికారులకు సమాచారం అందించడంతో వారు అమ్మాయిలను చేరదీశారు. వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించారు.

విద్యార్థులు తమ కలలను నిజం చేసుకునేందుకు తొలుత చదువుపై దృష్టిసారించాలని, ఆ తర్వాత తమ కలలను సాకారం చేసుకోవచ్చని వివరంగా చెప్పారు. స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ రోజువారీ జీవితంలో ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ వాటిని విద్యా సంబంధిత విషయాలకే ఉపయోగించాలని వివరించారు.  

ఈ సందర్భంగా కౌన్సెలింగ్ అధికారులు మాట్లాడుతూ పిల్లల కుటుంబ నేపథ్యాన్ని కూడా విస్మరించడానికి లేదన్నారు. ఒక అమ్మాయిది సింగిల్ పేరెంట్ కుటుంబమని, మరో అమ్మాయి తండ్రి మానసిక వికలాంగుడని పేర్కొన్నారు. బాలికల తల్లులు వ్యవసాయ కూలీలని, కాబట్టి పిల్లలను పర్యవేక్షించే సమయం వారికి లేకుండా పోయిందని తెలిపారు. ఎంత తీరిక లేకుండా ఉన్నా పిల్లల బాగోగులను కూడా పట్టించుకోవాలని సూచించారు. కౌన్సెలింగ్ అనంతరం తల్లిదండ్రులతో కలిసి ఈ నెల 6న రాత్రి అమ్మాయిలు సొంతూరుకు రైలులో బయలుదేరడంతో కథ సుఖాంతమైంది.

More Telugu News