Chandrababu: ఎమ్మెల్యేగా నేను ఉండాలో, వద్దో ప్రజాభిప్రాయం తీసుకుంటున్నా: చంద్రబాబు

  • కనిగిరిలో రా కదలిరా సభ
  • తానొక కొత్త విధానానికి శ్రీకారం చుట్టానన్న చంద్రబాబు
  • ఎమ్మెల్యేలపై ప్రజాభిప్రాయం కోరుతున్నానని వెల్లడి
  • తద్వారా మెరుగైన నాయకత్వం అందిస్తామని స్పష్టీకరణ
Chandrababu says he seeks people opinion on his MLA candidature

కనిగిరిలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడొక కొత్త విధానానికి తాను శ్రీకారం చుట్టానని వెల్లడించారు. తనతో సహా ప్రస్తుతం ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు అందరిపైనా ప్రజాభిప్రాయం తీసుకుంటున్నానని తెలిపారు. 

నేను బాగా పనిచేస్తున్నానా, మీకు అందుబాటులో ఉంటున్నానా... నేను మీ ఎమ్మెల్యేగా ఉండాలో, వద్దో చెప్పండి అంటూ నా నియోజకవర్గ ప్రజలకు ఒక ఐవీఆర్ఎస్ సందేశం పంపించి అభిప్రాయాలు సేకరిస్తున్నా అని వివరించారు. దీనివల్ల సరైన నాయకత్వం వస్తుందని, బాధ్యత కలిగిన నాయకులు వస్తారని, సమర్థవంతమైన నేతలు వస్తారని తెలిపారు. దీనిపై ప్రజలు కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుండాలని చంద్రబాబు కోరారు. 

"నా ఆలోచన ఒక్కటే. అందరికీ సామాజిక న్యాయం జరగాలి. ఆ సామాజిక న్యాయం కోసం నేను ముందుకు  వస్తాను... మీ అభిప్రాయాలు నిర్మొహమాటంగా తెలియజేయండి. ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకుంటాం. మెరుగైన నాయకత్వాన్ని అందించేందుకు ప్రయత్నిస్తాం" అని చంద్రబాబు స్పష్టం చేశారు.

More Telugu News