Brahmanandam: రామానాయుడుతో తనకు ఎక్కడ చెడిందో చెప్పిన బ్రహ్మానందం

  • బ్రహ్మానందం ఆత్మకథ విడుదల
  • 'నేను మీ బ్రహ్మానందమ్' పుస్తకంలో ఆసక్తికర అంశాలు
  • రామానాయుడుతో అనుకోని వివాదం ఏర్పడిందన్న బ్రహ్మానందం
  • అప్పుడే మేనేజర్ ను నియమించుకున్నానని వెల్లడి
Brahmanandam says what makes differences with star producer Ramanaidu

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తన జీవిత కథను 'నేను మీ బ్రహ్మానందమ్' పేరిట వెలువరించారు. ఈ పుస్తకంలో తన సినీ జీవితంలో ఎదురైన పరిస్థితులను వివరించారు. 'అహ నా పెళ్లంట' సినిమాతో తనకు మంచి గుర్తింపు లభించిందని, ఆ సినిమా ఇచ్చిన ధైర్యంతో... భార్య లక్ష్మి, పిల్లలు గౌతమ్, సిద్ధార్థలతో కలిసి మరిన్ని అవకాశాల కోసం మద్రాసులో అడుగుపెట్టానని బ్రహ్మానందం తన పుస్తకంలో వెల్లడించారు. 

కెరీర్ తొలినాళ్లలో దశాబ్ద కాలం పాటు రోజుకు 18 గంటలు కష్టపడ్డానని... పగలంతా షూటింగ్, రాత్రంతా డబ్బింగులతో సరిపోయేదని... ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకునే లోపు ఎవరో ఒకరు వచ్చి డబ్బింగ్ కు పిలుచుకుని వెళ్లేవారని వివరించారు. తన నటనకు వాయిస్ అదనపు హంగును తీసుకువచ్చిందని... జంధ్యాల గారి శిష్యుడన్న పేరు, చిరంజీవి గారితో ఎక్కువగా ఉండడం వల్ల చిరంజీవి గారి మనిషినన్న గుర్తింపు తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టాయని బ్రహ్మానందం వివరించారు. కానీ తనకు ఎలాంటి పొగరు, అహంభావం లేకపోయినా ఒక విషయంలో మాత్రం అవమానం జరిగిందని వెల్లడించారు. 

"రామానాయుడు గారు తన సొంత బ్యానర్లో 'బ్రహ్మపుత్రుడు' సినిమా తీస్తున్నారు. అందులో హీరో వెంకటేశ్... దర్శకుడు దాసరి నారాయణరావు. ఆ సినిమాలో నాకో వేషం ఇచ్చారు. నా జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం 'అహ నా పెళ్లంట' వచ్చింది రామానాయుడు గారి బ్యానర్ సురేశ్ ప్రొడక్షన్స్ లోనే. 'బ్రహ్మపుత్రుడు' చిత్రంలో కూడా అవకాశం రావడంతో చాలా సంతోషించాను. 

అయితే అదే సమయంలో జంధ్యాల గారి 'వివాహ భోజనంబు' చిత్రం ప్యాచ్ వర్క్ జరుగుతోంది. దాంతో ఆ సినిమా వాళ్లు నన్ను మద్రాస్ రమ్మన్నారు. కానీ తెల్లవారితే హైదరాబాద్ లో 'బ్రహ్మపుత్రుడు' షూటింగు... ఇటు చూస్తే మద్రాసులో 'వివాహ భోజనంబు' చిత్రం ప్యాచ్ వర్కు! ఏం అర్థంకాక అయోమయంలో పడిపోయాను. 

ఒకరేమో 'అహ నా పెళ్లంట' చిత్రంతో నా జీవితాన్ని మలుపు తిప్పిన దర్శకుడు జంధ్యాల... మరొకరేమో అదే సినిమాకు నిర్మాతగా ఉన్న రామానాయుడు గారు! అప్పటికి నేను నా డేట్స్ ఫలానా వాళ్లకు ఇచ్చాను అని చెప్పుకునే స్థాయిలో లేను. చివరికి 'వివాహ భోజనంబు' చిత్రం ప్యాచ్ వర్క్ కోసం మద్రాసు వెళ్లిపోయాను. 

ఇక, ఉదయాన్నే సురేశ్ ప్రొడక్షన్స్ మేనేజర్ కారు తీసుకుని అశోకా హోటల్ కు వెళ్లాడు. నేను మద్రాసు వెళ్లిపోయానని అక్కడి వాళ్లు చెప్పారు. కానీ, ఈ విషయం రామానాయుడుగారికి చేరే సరికి కొత్త రూపం దాల్చింది. బ్రహ్మానందం రాత్రంతా హోటల్ రూమ్ లో తప్ప తాగి, మరో సినిమా షూటింగ్ కు వెళ్లిపోయాడని రామానాయుడు గారికి చెప్పారు. ఆ విధంగా రామానాయుడు గారి దృష్టిలో చెడ్డవాడ్ని అయ్యాను. 

ఆ తర్వాత 'బ్రహ్మపుత్రుడు' చిత్రంలో నా ప్లేస్ లో నగేశ్ ను తీసుకున్నారని తెలిసింది. అవకాశం పోవడం బాధ అనిపించలేదు కానీ, అనవసరంగా అపవాదును మోయాల్సి వచ్చినందుకు బాధపడ్డాను. 

ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరావు సినిమాలో నేను, నూతన్ ప్రసాద్ నటిస్తున్నాం. నేను డల్ గా ఉండడం గమనించిన నూతన్ ప్రసాద్ నా వద్దకు వచ్చి ఇలా ఉన్నావేంటి అని అడిగారు. దాంతో ఆయనకు విషయం అంతా చెప్పాను. ఆ రోజు షూటింగ్ అయిపోయాక ఆయన తన కార్లోనే రామానాయుడు వద్దకు తీసుకెళ్లారు. నువ్వే వెళ్లి ఆయనతో మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందని నూతన్ ప్రసాద్ చెప్పారు. 

నేను లోపలికి వెళ్లేసరికి రామానాయుడు, దాసరి నారాయణరావుతో పాటు మరో వ్యక్తి ఉన్నారు. ఏంటయ్యా ఇలా వచ్చావు అని రామానాయుడు గారు అడిగారు. దాంతో జరిగిందంతా ఆయనకు చెప్పే లోపే... వాళ్లతో పాటు ఉన్న మరో వ్యక్తి "బుద్ధీ జ్ఞానం లేదా... తాగేసి షూటింగ్ మానేస్తావా" అంటూ అరిచాడు. నాకు మద్యం అలవాటు లేదని చెప్పాలనుకున్నాను కానీ ఆ వ్యక్తి చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. 

అప్పుడు రామానాయుడు గారు ఆ వ్యక్తికి సర్దిచెప్పి... నా వద్దకు వచ్చారు. భుజం తట్టి... "బ్రహ్మానందం నీకు మంచి భవిష్యత్తు ఉంది. కానీ డేట్స్ చూసుకోవడమే తెలియడంలేదు. అందుకే ఒక మంచి మేనేజర్ ను పెట్టుకో... అప్పుడీ గందరగోళం ఉండదు" అని సలహా ఇచ్చారు. అది అమూల్యమైన సలహా. ఆయన సంస్కారానికి నమస్కారం చేయాలనిపించింది. 

ఆ తర్వాత నేను మేనేజర్ ను నియమించుకున్నాను. ఆ మేనేజర్ ఎవరో కాదు... నా హితుడు, నా స్నేహితుడు, కాలేజీలో నా స్టూడెంట్ అయిన పోలిశెట్టి నాగశేషు. ఆ శేషు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాతోనే ఉన్నాడు... నా డేట్స్ చూస్తున్నాడు" అంటూ బ్రహ్మానందం వివరించారు.

More Telugu News