Bomb Threats: అయోధ్య రామమందిరానికి బాంబు బెదిరింపు.. ఇద్దరి అరెస్ట్

  • యోగి ఆదిత్యనాథ్, ఎస్‌టీఎఫ్ ఏడీజీ అమితాబ్ యశ్‌కు కూడా బెదిరింపులు
  • బెదిరింపుల కోసం నిందితులు ఉపయోగించిన ఈమెయిల్‌ను పాక్ ఐఎస్ఐ అధికారి క్రియేట్ చేసినట్టు గుర్తింపు
  • ఎన్జీవో నడుపుతున్న దేవేంద్ర తివారీ సూచనతోనే తామీ బెదిరింపులకు పాల్పడ్డామన్న నిందితులు
Bomb threats to Yogi Adityanath and Ayodhya Ram temple two arrested

అయోధ్య రామమందిరాన్ని పేల్చేస్తామని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై బాంబుదాడికి పాల్పడతామని బెదిరించిన ఇద్దరు వ్యక్తులను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌టీఎఫ్ అడిషన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీ) అమితాబ్ యష్‌‌కు కూడా బాంబు బెదిరింపులు వచ్చినట్టు పోలీసులు తెలిపారు.  

నిందితులను గోండాకు చెందిన తాహర్ సింగ్, ఓం ప్రకాశ్ మిశ్రాగా గుర్తించారు.  వివో టీ-2, శాంసంగ్ గెలాక్సీ ఏ-3 మొబైళ్లను ఉపయోగించి ఈమెయిల్స్ ద్వారా బెదిరింపు కాల్స్ పంపినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వై-ఫై రౌటర్, సీసీటీవీ కెమెరాకు సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డర్‌ను సీజ్ చేశారు. 

నిందితులు ఉపయోగించిన ఈమెయిల్స్ పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ అధికారి జుబేర్‌ఖాన్‌ క్రియేట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.  భారతీయ కిసాన్ మంచ్, భారతీయ గౌ సేవా పరిషత్ పేర్లతో ఎన్జీవో నిర్వహిస్తున్న దేవేంద్ర తివారీ సూచనలతోనే తామీ బెదిరింపులకు పాల్పడినట్టు విచారణలో నిందితులు తెలిపారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News