Seethakka: అనాథ పిల్లలకు అండగా తెలంగాణ సర్కారు

  • ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల సీట్లలో రిజర్వేషన్
  • అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మంత్రి సీతక్క
  • పాథమిక పాఠశాల పరిసరాల్లోనే అంగన్ వాడీ కేంద్రాలు
Telangana Minister Review Meeting With Department Higher Officials

తెలంగాణలోని అనాథ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. అనాథలమని అధైర్య పడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల సీట్లలో అనాథలకు 2 శాతం రిజర్వేషన్ కల్పించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు మంత్రి సీతక్క బుధవారం ట్వీట్ చేశారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చూడాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు.

అంగన్ వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాల పరిసరాల్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు. స్కూలు ఆవరణలోనే ప్రీ స్కూళ్ల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాలకు స్థానిక మండలాల నుంచే పాలు సరఫరా చేయాలని సూచించారు. ఈమేరకు మంగళవారం సచివాలయంలోని తన ఛాంబర్ లో మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో స్త్రీశిశు సంక్షేమ ముఖ్యకార్యదర్శి వాకాటి కరుణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దత్తత నిబంధనలు క్లిష్టంగా ఉండడంతో చాలామంది పిల్లల దత్తతకు ముందుకు రావడం లేదన్నారు. నిబంధనలను సరళతరం చేసే అవకాశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. మహిళా ఉద్యోగస్తుల కోసం సిటీలు, జిల్లా కేంద్రాల్లో వసతి గృహాలను, ప్రతి జిల్లాలోనూ వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్క అధికారులకు సూచించారు.

More Telugu News