Jagan: మరో మూడు నెలల్లో మేమూ బటన్ నొక్కుతాం.. మీ అడ్రస్ గల్లంతవుతుంది: ఏపీ అంగన్వాడీలు

  • 21వ రోజుకు చేరుకున్న అంగన్వాడీల సమ్మె
  • కొత్త సంవత్సరం రోజున రోడ్లపై కూర్చునేలా జగన్ చేశారని మండిపాటు
  • ఎన్నికల సమయంలో మాకు హామీ ఇచ్చింది మీరు కాదా? అని ఆగ్రహం
AP Anganwadis fires on Jagan

న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు చేపట్టిన సమ్మె 21వ రోజుకు చేరుకుంది. మచిలీపట్నంలో సమ్మెలో పాల్గొంటున్న అంగన్వాడీలు మీడియాతో మాట్లాడుతూ... కొత్త సంవత్సరం రోజున కుటుంబంతో కలిసి సంతోషంగా ఇంట్లో ఉండాల్సిన తమను రోడ్లపై కూర్చునేలా జగన్ చేశారని మండిపడ్డారు. ఆయనది రాతి గుండె అనే విషయం అర్థమయిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.10 లక్షల మంది సమ్మెలో ఉంటే ముఖ్యమంత్రి ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో తమకు హామీలు ఇచ్చింది మీరు కాదా? అని ప్రశ్నించారు. 

తమరి మాటలను నమ్మి వైసీపీకి ఓట్లు వేస్తే... ఇప్పుడు తమను ఇలా ఇబ్బంది పెడతారా? అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందించి, తమకు న్యాయం చేయాలని అన్నారు. తమ వేతనాలు పెంచేలా జగన్ బటన్ నొక్కాలని... లేకపోతే మూడు నెలల్లో తాము బటన్ నొక్కుతామని, అప్పడు వైసీపీ అడ్రస్ గల్లంతవుతుందని వారు హెచ్చరించారు.

More Telugu News