YS Vivekananda Reddy: సీబీఐ ఎస్పీ రామ్ సింగ్, వివేకా కుమార్తె, అల్లుడికి నోటీసులు పంపిన పులివెందుల పోలీసులు

  • తనను వేధిస్తున్నారంటూ కోర్టును ఆశ్రయించిన వివేకా పీఏ
  • కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించిన పులివెందుల కోర్టు
  • సీబీఐ ఎస్పీ, సునీత, రాజశేఖర్ రెడ్డిలపై ఈ నెల 15న కేసు నమోదు
  • నిన్న పులివెందుల కోర్టులో చార్జిషీటు దాఖలు
  • తాజాగా 41-ఏ కింద నోటీసులు పంపిన పోలీసులు
Pulivendula police sent notice to CBI SP Ram Singh and Suneetha

మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన సీబీఐ ఎస్పీ రామ్ సింగ్, వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలపై పులివెందుల అర్బన్ పోలీసులు నిన్న పులివెందుల కోర్టులో చార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలో పులివెందుల పోలీసులు నేడు ఆ ముగ్గురికీ రిజిస్టర్ పోస్టు ద్వారా నోటీసులు పంపారు. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్, డాక్టర్ సునీతారెడ్డి, రాజశేఖర్ రెడ్డిలకు 41-ఏ కింద నోటీసులు పంపారు. 

కోర్టులో చార్జిషీటు దాఖలు చేశామని వారికి పంపిన నోటీసుల్లో పేర్కొన్న పులివెందుల పోలీసులు... దాఖలు చేసిన అభియోగాలపై విచారణకు రావాలని స్పష్టం చేశారు. 

సీబీఐ అధికారులు తనను వేధిస్తున్నారని, వివేకా కుమార్తె బెదిరింపులకు పాల్పడ్డారని వివేకా పీఏ కృష్ణారెడ్డి రెండేళ్ల కిందట కోర్టును ఆశ్రయించగా, కేసులు నమోదు చేయాలంటూ కోర్టు పోలీసులను ఆదేశించింది. జనవరి 4 లోపు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. 

ఈ నేపథ్యంలోనే, పులివెందుల అర్బన్ పోలీసులు ఈ నెల 15న సీబీఐ ఎస్పీ రామ్ సింగ్, డాక్టర్ సునీతా రెడ్డి, రాజశేఖర్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు.

More Telugu News