BTech Ravi: జగన్... నువ్వు పులివెందుల నుంచి వెళ్లిపోతే నా పరిస్థితి ఏంటి?: నవ్వులు పూయించిన బీటెక్ రవి

  • తనకు గన్ మన్లను తొలగించారని బీటెక్ రవి వెల్లడి
  • సీఎం సింహాద్రిపురం పర్యటనకు జనాలు రాలేదని వ్యాఖ్య 
  • అందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని విమర్శలు  
BTech Ravi slams CM Jagan again

సీఎం జగన్ తన గన్ మన్లను తొలగించారని టీడీపీ నేత బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అంతమొందించేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తనకు ఎలాంటి ప్రాణహాని జరిగినా సీఎం జగన్, వైఎస్ భారతి, అవినాశ్ రెడ్డిలదే బాధ్యత అని స్పష్టం చేశారు. తనకు గన్ మన్లను తొలగించడంపై హైకోర్టును ఆశ్రయిస్తానని బీటెక్ రవి వెల్లడించారు. కాగా, వచ్చే ఎన్నికల్లో జగన్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ తనకు అవకాశం కల్పించాలని టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ఎదుట నవ్వులు పూయించారు.

"వైసీపీలో ఇన్చార్జులను, ఎమ్మెల్యేలను అటూ ఇటూ, పైనుంచి కిందికి, కింది నుంచి పైకి, ఆ పక్క నుంచి ఈ పక్కకి మార్చుకుంటున్నారు. ఇది మీ పార్టీ అంతర్గత విషయం కాబట్టి మేం పట్టించుకోం. 

కానీ సీఎం జగన్, మేం కోరేది ఏంటంటే... అటూ ఇటూ మార్చుకునే ప్రక్రియలో నిన్ను నువ్వు మార్చుకునేవు...! నువ్వు పులివెందులలో లేకుండా పోతే నా పరిస్థితి ఏంటి? నేనేదో నిన్ను నమ్ముకుని, నువ్వు పులివెందుల ప్రజలకు చేసిన అన్యాయం, వారి పట్ల నీ నిర్లక్ష్యం, పులివెందుల ప్రజలను నువ్వు అగౌరవపరిచిన విధానం... వీటన్నింటి నేపథ్యంలో నీపై నేను పోటీ చేస్తుంటే నువ్వు పులివెందుల నుంచి వెళ్లిపోతే నా గతేం కాను? అందుకే, నీ సీటునైనా నువ్వు మార్చుకోకుండా ఉండు అని ముఖ్యమంత్రిని కోరుతున్నాం. 

అలాగే, చంద్రబాబుకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా...  ఒకవేళ జగన్ పులివెందులను విడిచి వెళ్లిపోతే ఆయన ఎక్కడ పోటీ చేస్తే నన్ను కూడా అక్కడికి పంపించాలని కోరుతున్నా" అని బీటెక్ రవి వ్యాఖ్యానించారు.

More Telugu News