YS Sharmila: షర్మిల విషయంలో మేం అందరం ఒకటే మాట చెప్పాం: కాంగ్రెస్ నేత పళ్లంరాజు

  • షర్మిల కాంగ్రెస్ లో చేరుతోందంటూ వార్తలు
  • సీడబ్ల్యూసీ సమావేశంలో షర్మిల అంశం చర్చకు వచ్చిందన్న పళ్లంరాజు
  • షర్మిల వస్తే కాంగ్రెస్ కు బలం చేకూరుతుందని వెల్లడి
  • ఆమెకు ఏపీ పగ్గాలు అప్పగించే విషయం చర్చకు రాలేదని స్పష్టీకరణ
Pallamraju talks about Saharmila issue

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కాంగ్రెస్ లో చేరే అంశంపై కేంద్ర మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు పళ్లంరాజు స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ కుమార్తె షర్మిల కాంగ్రెస్ లో చేరితే తప్పకుండా పార్టీకి బలం చేకూరుతుందని అన్నారు. 

షర్మిల పార్టీలోకి వస్తే ఎలా ఉంటుందని కాంగ్రెస్ సమావేశంలో అందరినీ అడిగారని, ఆమె వస్తే పార్టీకి మేలు జరుగుతుందని ముక్తకంఠంతో చెప్పామని పళ్లంరాజు వెల్లడించారు. షర్మిల విషయాన్ని కాంగ్రెస్ సమావేశంలో ఏ ఒక్కరు కూడా వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. 

అయితే, షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించే విషయం సమావేశంలో చర్చకు రాలేదని, ఆమె పార్టీలోకి వస్తే ఎలా ఉంటుందన్న అంశంపైనే చర్చ జరిగిందని పళ్లంరాజు తెలిపారు. షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే పార్టీకి ఉపయోగకరంగా ఉంటుందని ఏకాభిప్రాయం వ్యక్తమైందని వివరించారు.

More Telugu News