Chaitanya: పవన్ సమక్షంలో జనసేనలో చేరిన మాజీ ఎంపీ డీకే ఆదికేశవులునాయుడు మనవరాలు

  • చైతన్యకు జనసేన కండువా కప్పిన పవన్ కల్యాణ్
  • పార్టీలోకి సాదరంగా ఆహ్వానం
  • తాత ఆదికేశవులునాయుడు బాటలో నడవాలని ఆమెకు సూచన
DK Adikesavulu Naidu grand daughter Chaitanya joins Janasena party

మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త, దివంగత డీకే ఆదికేశవులునాయుడు మనవరాలు చైతన్య జనసేన పార్టీలో చేరారు. ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆమెకు పార్టీ కండువా కప్పారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 

చైతన్య ట్రస్టు ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తన కార్యక్రమాలను జనసేన ద్వారా మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆమె భావిస్తున్నారు. 

జనసేన పార్టీలోకి వచ్చిన సందర్భంగా చైతన్యకు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా తాత ఆదికేశవులునాయుడు బాటలో నడవాలని ఆమెకు సూచించారు. ఆదికేశవులునాయుడు సమాజ అభివృద్ధి కోసం ఎంతగానో తపించారని, టీటీడీ బోర్డు చైర్మన్ గా ధర్మ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తిని చైతన్య కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. 

కాగా, ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.

More Telugu News