Nara Lokesh: నేడు సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులకు మా పూర్తి మద్దతు: నారా లోకేశ్

Nara Lokesh extends support to muncipal Asha workers protesting against ap govt
  • ఇష్టమొచ్చినట్టు హామీలు ఇచ్చి జగన్ ప్రజలను మోసగించారన్న లోకేశ్
  • ఏపీ ఉద్యమాంధ్రప్రదేశ్‌గా మారిందని వ్యాఖ్య
  • డిమాండ్ల పరిష్కారం కోసం రోడ్డెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి వచ్చిందని విమర్శ
  • మున్సిపల్ కార్మికులకు మద్దతుగా నిలవాలని పార్టీ శ్రేణులకు పిలుపు
ఏపీ ప్రస్తుతం ఉద్యమాంధ్రప్రదేశ్‌గా మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. తన పాదయాత్రలో ఇష్టమొచ్చినట్టు హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక అందర్నీ మోసం చేశారని విమర్శించారు. నేటి నుంచి ప్రారంభం అవుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు కూడా టీడీపీ పూర్తి స్థాయి మద్దతు ఇస్తుందని తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లకు మద్దతు తెలపాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపు నిచ్చారు. 

‘‘పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప.. ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్ గా మారింది. పాదయాత్రలో నోటికొచ్చిన హామీలు ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ మోసం చేశాడు. అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు, ఆశా వర్కర్లు, త్వరలో వలంటీర్లు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రోడ్లెక్కి నిరసన తెలపాల్సిన దుస్థితి. ఈ రోజు నుండి ప్రారంభం అవుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెకు కూడా టీడీపీ పూర్తి స్థాయి మద్దతు ఇస్తోంది. అంగన్వాడీల సమ్మెకు ఎలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు మద్దతు తెలిపాయో అలానే తమ సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న మున్సిపల్, ఆశా వర్కర్లకు మద్దతు తెలపాలని పిలుపు ఇస్తున్నాను’’ అని  నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

More Telugu News

Nara Lokesh
Telugudesam
YS Jagan
YSRCP
Andhra Pradesh