Drone attack: 20 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి

  • పోరుబందర్ పోర్టుకు 217 నాటికల్ మైళ్ల దూరంలో ఘటన..
  • ప్రాణనష్టం లేదని వెల్లడించిన ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు
  • అరేబియాలోని ఓ నౌకాశ్రయం నుంచి క్రూడాయిల్‌తో మంగళూరు వస్తుండగా దాడి
  • దాడికి గురైన నౌక దిశగా ఐసీజీఎస్ విక్రమ్‌ నౌక బయలుదేరిందని వెల్లడి
Drone attack on commercial ship carrying 20 Indians

అరేబియా సముద్రంలో 20 మంది భారతీయులతో ప్రయాణిస్తున్న ఎంవీ కెమ్ ప్లూటో అనే వాణిజ్య నౌకపై శనివారం డ్రోన్ దాడి జరిగింది. గుజరాత్‌లోని పోరుబందర్ పోర్టుకు 217 నాటికల్ మైళ్ల దూరంలో జరిగిన ఈ దాడిలో నౌకలో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, దాడికి గురైన షిప్ దిశగా ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌక ‘ఐసీజీఎస్ విక్రమ్‌’ బయలుదేరిందని ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులు వెల్లడించారు. సముద్ర గస్తీ విమానం ‘డోర్నియర్’ రంగంలోకి దిగి దాడికి గురైన ఎంవీ కెమ్ ప్లూటో నౌకతో కమ్యూనికేషన్‌ను అనుసంధానించిందని తెలిపారు.

దాడికి గురైన ఎంవీ కెమ్ ప్లూటో మర్చంట్ షిప్ సౌదీ అరేబియాలోని ఓ పోర్ట్ నుంచి క్రూడాయిల్‌తో మంగళూరుకు బయలుదేరిందని అధికారులు చెప్పారు. ఇండియన్ ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కోస్ట్ గార్డ్ షిప్ ‘ఐసీజీఎస్ విక్రమ్‌’ దాడికి గురైన ఎంవీ కెమ్ ప్లూటో దిశగా కదిలి వెళ్తోందని అధికారులు వివరించారు. దాడికి గురైన నౌక సహాయం అందించాలని ఆ ప్రాంతంలోని నౌకలన్నింటికీ సమాచారం అందించినట్టు వివరించారు. అయితే ఎంవీ ఫ్లూటో నౌక 11 నాటికల్ మైళ్ల వేగంతో కదలుతోందని వెల్లడించారు. కాగా నౌకల ట్రాకింగ్ కోసం ఉపయోగించే ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్‌ను స్విచ్ ఆఫ్ చేశారని అధికారులు తెలిపారు.

More Telugu News