Revanth Reddy: తెలివైనవాడు ఎలా ఉంటాడంటే... పీవీ చెప్పిన మాటల్ని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి

  • పీవీ వర్ధంతి సందర్భంగా జ్ఞానభూమి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించిన రేవంత్
  • దేశకీర్తిని ప్రపంచానికి చాటిన మేధావి అన్న ముఖ్యమంత్రి
  • పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచారని వ్యాఖ్య 
CM Revanth Reddy praises PV Narasimha Rao

 పీవీ కీర్తిని పెంచేలా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా ఆయన పీవీ జ్ఞానభూమి వద్ద  పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశకీర్తిని ప్రపంచానికి చాటిన మేధావి పీవీ అన్నారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. 

దేశ ఆర్థిక వ్యవస్థ ప్రశ్నార్థంగా మారిన పరిస్థితుల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకొని దేశాన్ని ముందుకు నడిపించారని గుర్తు చేశారు. బంగారాన్ని కుదువపెట్టి అప్పు తేవడంపై పీవీ ఒక మాట చెప్పారని... తెలివైన వాడు సగం ఆస్తిని కుదువపెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటారని చెప్పారని గుర్తు చేశారు.

భూమిని పేదవాడికి అందుబాటులోకి తీసుకు వచ్చిన వ్యక్తి పీవీ అన్నారు. పేదలకు భూములు పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారని తెలిపారు. పీవీ మన మధ్య లేకపోయినా ఆయన చేపట్టిన సంస్కరణలు ఎప్పటికీ ఆచరణీయమన్నారు. పీవీ ఘాట్, జైపాల్ రెడ్డి ఘాట్‌లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వీరిద్దరు తెలంగాణకు లంకె బిందెలవంటి వారన్నారు. 

More Telugu News