Anantapur District: అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్-బస్సు ఢీ.. నలుగురి మృతి!

  • గార్లదిన్నె మండలం కల్లూరు వద్ద శనివారం వేకువ జామున ప్రమాదం
  • బియ్యం లోడుతో వెళుతున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు 
  • ట్రాక్టర్‌లోని నలుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి
  • బస్సు డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలు
Private bus collides with tractor in anantapur four dead

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో నేటి ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. వేకువ జామున బియ్యం లోడుతో వెళుతున్న ట్రాక్టర్‌ను ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో ట్రాక్టర్‌లో ఉన్న నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. బస్సు డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతులను గుత్తిమండలం మామిడూరుకు చెందిన చిన్నతప్పయ్య (45), శ్రీరాములు (45), నాగార్జున (30), శ్రీనివాసులు(30) గా గుర్తించారు. ఘటనలో గాయపడ్డ నరేశ్ పరిస్థితి విషమంగా మారడంతో అతడిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News