Ram Charan: మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేను కలిసిన రామ్ చరణ్, ఉపాసన... ఫొటోలు ఇవిగో!

  • ముంబయిలో పర్యటిస్తున్న రామ్ చరణ్, ఉపాసన
  • ఇటీవల మహాలక్ష్మి ఆలయంలో కుమార్తె పేరిట పూజలు
  • తాజాగా షిండే నివాసంలో సందడి చేసిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు
Ram Charan and Upasana met Maharashtra CM Eknath Shinde in Mumbai

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేను కలిశారు. ఇటీవల తమ కుమార్తె క్లీంకార పేరిట ముంబయిలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన రామ్ చరణ్, ఉపాసన తాజాగా, మహారాష్ట్ర సీఎం నివాసానికి విచ్చేశారు. 

సీఎం ఏక్ నాథ్ షిండే నివాసంలో చరణ్, ఉపాసనలకు సంప్రదాయబద్ధ స్వాగతం లభించింది. షిండే కుమారుడు ఎంపీ శ్రీకాంత్ షిండే, కోడలు వృషాలి తమ ఇంటికి వచ్చిన అతిథులకు ఘనస్వాగతం పలికారు. వృషాలి... ఉపాసన నుదుటన కుంకుమ అద్ది, హారతి ఇచ్చారు. అనంతరం, షిండే, ఆయన కుటుంబ సభ్యులతో రామ్ చరణ్, ఉపాసన భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా ఇరువురు కానుకలు ఇచ్చి పుచ్చుకున్నారు. రామ్ చరణ్ కు సీఎం షిండే వినాయక విగ్రహాన్ని అందజేశారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులతో సమావేశం ఆహ్లాదకరంగా సాగిందని ఏక్ నాథ్ షిండే సోషల్ మీడియాలో వెల్లడించారు. 

అటు, ఈ భేటీపై ఉపాసన కూడా సోషల్ మీడియాలో స్పందించారు. షిండే కుటుంబ ఆతిథ్యం అద్భుతం అని కొనియాడారు. షిండే కుటుంబ సభ్యుల ఆప్యాయతకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తెలిపారు.

More Telugu News