కొత్తగా ఆధార్ తీసుకునే వారికి ఇకపై ఫిజికల్ వెరిఫికేషన్!

Verification now compulsory for Aadhaar for those above 18 years
  • 18 ఏళ్లు పైబడి తొలిసారిగా ఆధార్ జారీ చేసుకునేవారికి కొత్త నిబంధన
  • రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని యూఐడీఏఐ ప్రకటన
  • ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు నోడల్, సబ్ డివిజనల్ అధికారులను నియమిస్తాయని వెల్లడి
  • ఆధార్ అప్‌డేషన్ మాత్రం ప్రస్తుత పద్ధతిలోనే ఉంటుందని వివరణ
పద్దెనిమిదేళ్ల వయసు దాటి, తొలిసారిగా ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని యూఐడీఏఐ సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం పాస్‌పోర్ట్ వెరిఫికేషన్ తరహా వ్యవస్థను సిద్ధం చేసినట్టు వెల్లడించాయి. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు.. జిల్లా, సబ్ డివిజనల్ స్థాయుల్లో  నోడల్ ఆఫీసర్లు, సబ్ డివిజనల్ ఆఫీసర్లను నియమిస్తాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఫిజికల్ వెరిఫికేషన్ కోసం జిల్లా ప్రధాన పోస్టాఫీసులు, ఇతర ఆధార్ కేంద్రాలను ప్రత్యేకంగా ఎంపిక చేస్తామని కూడా అధికారులు పేర్కొన్నారు. 

ఈ క్రమంలో తొలిసారిగా దరఖాస్తు చేసుకునే వారి వివరాలపై డాటా క్వాలిటీ చెక్స్ నిర్వహిస్తారు. అనంతరం, సర్వీస్‌ పోర్టల్ ద్వారా వెరిఫికేషన్‌కు పంపిస్తారు. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో వెరిఫికేషన్ పూర్తయ్యాక క్లియరెన్స్ వచ్చిన 180 రోజుల్లోపు ఆధార్ జారీ చేస్తారు. ఈ కొత్త నిబంధనలన్నీ 18 ఏళ్లకు పైబడి తొలిసారిగా దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమేనని యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ఆధార్ కార్డు జారీ అయ్యాక సాధారణ పద్ధతుల్లోనే వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చని సూచించారు.
Go Back to Shorts
Aadhar Physical Verification
UIDAI

More Telugu News