Mumbai Indians: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌ను మార్చడంపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ భార్య రితికా

  • రోహిత్‌ను ప్రశంసిస్తూ చెన్నై సూపర్ కింగ్స్ పెట్టిన ‌ఇన్‌స్టా పోస్టుకు స్పందించిన రితికా
  • పసుపు రంగు ‘హార్ట్ ఎమోజీ’ ద్వారా రియాక్ట్ అయిన రోహిత్ భార్య
  • రోహిత్ స్థానంలో పాండ్యాకు ముంబై కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై క్రికెట్ వర్గాల్లో చర్చ
Rohit Sharma wife Ritika was the first to react to the change of Mumbai Indians captain

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో హార్ధిక్ పాండ్యా పేరును ప్రకటించడం క్రికెట్ వర్గాల్లో చర్ఛనీయాంశమైంది. జట్టుని ఏకంగా 5 సార్లు టైటిల్ విజేతగా నిలిపిన హిట్‌మ్యాన్‌ని కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇప్పటికే పలువురు క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు స్పందించగా తాజాగా రోహిత్ శర్మ భార్య రితికా కూడా తొలిసారి రియాక్ట్ అయ్యింది.

ముంబై కెప్టెన్‌ మార్పు అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియాలో హృదయపూర్వకంగా స్పందించింది. ‘‘2013 - 2023 : ఉత్సాహభరితమైన సవాలుకు ఒక ఏడాది! చాలా గౌరవప్రదం రోహిత్!’’ అంటూ రోహిత్‌కు సానుభూతిగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్టు పెట్టింది. ఈ పోస్టుపై పసుపు రంగు హార్ట్ ఎమోజీతో రితికా స్పందించింది. కాగా పసుపు రంగు చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎంతో ప్రత్యేకమైనది. ఆ జట్టు జెర్సీ కూడా అదే రంగులో ఉంటుంది. చెన్నై సొంత మైదానం మొత్తం పసుపుమయంగా కనిపిస్తుందన్న విషయం తెలిసిందే.

కాగా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌కి ఏకంగా 11 సీజన్లలో నాయకత్వం వహించాడు. అతడి సారధ్యంలో జట్టు అత్యంత బలమైన జట్టుగా ఎదిగింది. ఏకంగా 5 సార్లు ఐపీఎల్ విజేతగా నిలిపాడు. అయితే హార్దిక్ పాండ్యా గత నెలలో ఫ్రాంచైజీకి తిరిగి వచ్చాక ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా జట్టు ప్రకటించింది. భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా కెప్టెన్‌ను మార్చామని ముంబై ఇండియన్స్ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్రాంచైజీకి ఆదర్శప్రాయమైన సేవలు అందించిన రోహిత్‌కు ధన్యవాదాలు అంటూ పేర్కొంది.

More Telugu News