Pawan Kalyan: జనసేనాని పవన్ కల్యాణ్ ను కలిసిన కేశినేని చిన్ని

  • హైదరాబాదులో పవన్ నివాసానికి వెళ్లిన టీడీపీ నేత కేశినేని చిన్ని
  • ఏపీ రాజకీయాలపై చర్చ
  • కేశినేని ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సామాజిక సేవలను పవన్ కు వివరించిన చిన్ని
  • చిన్నిని అభినందించిన పవన్ కల్యాణ్
Kesineni Chinni met Pawan Kalyan in Hyderabad

టీడీపీ ఎంపీ కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని (శివనాథ్) నేడు హైదరాబాదులో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. హైదరాబాదులోని పవన్ నివాసానికి వెళ్లిన కేశినేని చిన్ని... జనసేనానితో సమావేశమయ్యారు. ఏపీ రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా తమ కేశినేని ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి చిన్ని... పవన్ కల్యాణ్ కు వివరించారు. 

ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై పవన్ కల్యాణ్ ఎలుగెత్తిన అంశాన్ని ప్రస్తావించిన చిన్ని... మీ పోరాటం మాకు ప్రేరణగా నిలిచింది అంటూ కొనియాడారు. పవన్ స్ఫూర్తితోనే విజయవాడ పార్లమెంటు పరిధిలో పలు సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేశామని వివరించారు. ఏ-కొండూరు మండలంలోనూ కిడ్నీ బాధితులు ఉండడంతో, అక్కడ వారిని ఆదుకునే కార్యాచరణ చేపట్టామని చిన్ని... పవన్ కు తెలిపారు. 

ఓసారి ఏ-కొండూరు మండలానికి వచ్చి అక్కడి కిడ్నీ బాధితుల్లో ధైర్యం నింపాలని చిన్ని ఈ సందర్భంగా పవన్ ను కోరారు. పవన్ స్పందిస్తూ... కేశినేని చిన్ని చేపడుతున్న సామాజిక సేవలను అభినందించారు. విజయవాడ వచ్చినప్పుడు ఏ-కొండూరు మండలంలో పర్యటించి తప్పనిసరిగా కిడ్నీ బాధితుల్లో ఉత్సాహం నింపుతానని తెలిపారు. ఈ మేరకు పవన్ తో భేటీ అనంతరం కేశినేని చిన్ని వెల్లడించారు. 

ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో జైల్లో ఉన్నప్పుడు టీడీపీ శ్రేణులకు పవన్ కల్యాణ్, జనసేన పార్టీ అండగా నిలిచిన వైనాన్ని ప్రస్తావించి పవన్ కు ధన్యవాదాలు తెలిపానని చిన్ని వివరించారు.

More Telugu News